సంగారెడ్డి టౌన్: పట్టణంలోని పలు వీధుల్లో లాక్ డౌన్ పరిస్థితిని సంగారెడ్డి తహసీల్దార్ స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించని వారికి ఒక్కొక్కరికి రూ.100 జరిమానా విధించారు. గురువారం ఒక్కరోజే 100 మందికి జరిమానాలు విధించడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా తిరుగుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు లేకుండా పళ్లు విక్రయిస్తున్న వారిని మందలించారు. మెడికల్, నిత్యావసర వస్తువులను ఇంటికే అందించేందుకు ఏర్పాట్లు చేశామని తహసీల్దార్ తెలిపారు. అప్నా చోటు యాప్ ద్వారా ప్రజలు నిత్యవసర సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.
కూరగాయల మార్కెట్లో..
సంగారెడ్డి మున్సిపాలిటీ: మాస్కులు లేకుండా రోడ్లపైకి, కూరగాయల మార్కెట్లోకి వచ్చిన వంద మందికి మున్సిపల్ అధికారులు గురువారం ఫైన్ విధించారు. మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గురువారం కూరగాయల మార్కెట్తో సహా పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది పర్యటించి మాస్కులు లేకుండా కనిపించిన వంద మందికి రూ.100 ఫైన్ విధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఇంతియాజ్, సూర్యప్రకాష్, సంపత్ రెడ్డి, విజయ్ బాబు తదితరులు ఉన్నారు.