వివాహేతర సంబంధం పెట్టుకుందని..

18 Jul, 2019 11:14 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల : వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను గ్రామస్తులు ట్రాక్టర్‌కు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే.. బోనాల గ్రామానికి చెందిన కున్న లావణ్య భర్త నాగరాజు విదేశాల్లో ఉంటాడు. అయితే ఇక్కడ ఒంటరిగా ఉంటున్న లావణ్య.. అదే గ్రామానికి చెందిన పడుగే నారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. లావణ్య, నారాయణల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు బయటకి పొక్కడంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. దీంతో వారిద్దరు గ్రామం నుంచి పారిపోయారు.

వారు సిరిసిల్లలోని శివనగర్‌లో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. ఈ విషయం నారాయణ కుటుంబసభ్యులకు తెలియడంతో బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లి అతన్ని ఇంటికి పట్టుకుని వచ్చారు. దీంతో లావణ్య నారాయణ కనిపించడం లేదని.. అతన్ని వారి బంధువులు తీసుకెళ్లారని పోలీసులను ఆశ్రయించారు. అనంతరం లావణ్య నేడు గ్రామానికి చేరుకుని.. నారాయణ ఇంటికి వెళ్లారు. లావణ్య అక్కడికి రావడంతో నారాయణ కుటుంబసభ్యులు ఆమెను బంధించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్‌ ముందు భాగంలో కట్టేసి ఆమెను చితకబాదారు.

మరిన్ని వార్తలు