సెన్సెక్స్ 170 పాయింట్ల పతనం

30 Apr, 2015 01:45 IST|Sakshi
సెన్సెక్స్ 170 పాయింట్ల పతనం

► కొనసాగుతున్న లాభాల స్వీకరణ
► 27,226 పాయింట్లకు సెన్సెక్స్
► 46 పాయింట్ల నష్టంతో 8,240కు నిఫ్టీ  
 

రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ చివరకు నష్టాల్లో ముగిసింది. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ముగింపు,   అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫలితాలు కూడా గురువారం రాత్రి వెల్లడి కానుండడంతో ఇన్వెస్టర్లు బుధవారం ఆచి తూచి వ్యవహరించారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 27,226 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 8,240 వద్ద ముగిశాయి.  

ఎఫ్‌ఐఐలకు సంబంధించి కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)పై ఆందోళనలు, ఉత్తేజపరచని కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, భూ సేకరణ బిల్లులో జాప్యం తదితర కారణాల వల్ల లాభాల స్వీకరణ కొనసాగుతోందని జియోజిత్ బీఎన్‌పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఎఫ్‌ఎంసీజీ, వాహన, లోహ, రిఫైనరీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా, రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్, ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 27,396 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

ఆ తర్వాత 27,177 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తదుపరి ఎంపిక చేసిన బ్లూ చిప్ షేర్లలో షార్ట్ కవరింగ్ కారణంగా ఇంట్రాడేలో గరిష్ట స్థాయి, 27,439 పాయింట్లకు ఎగసింది. చివరలో అమ్మకాల ఒత్తిడితో 170 పాయింట్ల నష్టంతో 27,226 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8,219, 8,308 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 46 పాయింట్ల నష్టంతో 8,240 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి.

లాభనష్టాలు..

క్యూ 4 ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడం భారతీ ఎయిర్‌టెల్ షేర్ 3.3 శాతం క్షీణించి వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా నష్టపోయిన షేర్ ఇదే. ఇక హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ షేర్ 2.11 శాతం పడిపోయింది. ఐటీసీ 2.7 శాతం, వేదాంత 2.1 శాతం, టాటా మోటార్స్ 1.8 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.5 శాతం, మారుతీ 1.4 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1 శాతం చొప్పున తగ్గాయి. ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే యాక్సిస్ బ్యాంక్ 3.3 శాతం, గెయిల్ 2 శాతం, విప్రో 1.8 శాతం, సన్ ఫార్మా 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1 శాతం చొప్పున పెరిగాయి. 1,182 షేర్లు నష్టాల్లో, 1,524 షేర్లు లాభాల్లో ముగిశాయి.

టర్నోవర్..
టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,964  కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.16,802 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,63,657 కోట్లుగా  నమోదైంది.

మరిన్ని వార్తలు