బీహార్లో మధ్యాహ్న భోజనం తిని 22 మందికి అస్వస్థత

16 Aug, 2013 19:34 IST|Sakshi

బీహార్ రాష్ట్రాన్ని మధ్యాహ్న భోజన విషాదం వీడట్లేదు. ఆ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాందాహా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పిల్లలను హాజీపూర్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చామని, వారిలో ముగ్గురు తప్ప మిగిలిన వారంతా ప్రమాదం నుంచి బయటపడినట్లేపనని అధికారులు తెలిపారు. ఈ ముగ్గురి పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందన్నారు.

శుక్రవారం నాటి మధ్యాహ్న భోజనంలో అన్నం, కూరగాయలు, పప్పు పెట్పటారు. అన్నం తినగానే పిల్లలు తమకు కడుపులో నొప్పిగా ఉన్నట్లు చెప్పారని, కొద్దిసేపటికే వారికి వాంతులయ్యాయని ఓ అధికారి చెప్పారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి తమ పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో జూలై 16వ తేదీన బీహార్ రాష్ట్రంలోని శరణ్ జిల్లాలో మధ్యాహ్నభోజనం తిని 23 మంది పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి భోజనంలో తేడా అనగానే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీహార్లోని 72 వేల పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. సుమారు 1.6 కోట్ల మంది విద్యార్థులకు రోజూ భోజనం పెడుతున్నారు.

మరిన్ని వార్తలు