గత పాలకుల వల్లే కష్టాలు

14 Sep, 2015 01:58 IST|Sakshi

శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల రౌండ్‌టేబుల్ సమావేశంలో హరగోపాల్
హైదరాబాద్ : శ్రీశైలం ముంపు బాధితులకు నేటికీ ఉద్యోగాలను ఇవ్వకపోవడం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలమూరు అధ్యయన వేదిక - హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా  హరగోపాల్ మాట్లాడు తూ ప్రాజెక్టును నిర్మించినప్పుడు భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి సీఎం ఎన్టీరామారావు ఇచ్చిన 98,68 జీవోలను ఇప్పటికీ ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదన్నారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో  మహబూబ్‌నగర్‌కు వెళ్లిన కేసీఆర్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని  గుర్తుచేశారు. బాధితులు 160 రోజుల పాటు తమకు ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రధాన డిమాం డ్‌తో ఉద్యమిస్తున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు.

అర్హత కలిగిన 2,500 మంది నిరుద్యోగులు నిర్వాసితుల్లో ఉన్నారని, వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలు వారికి అండగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారినా, ప్రత్యేక తెలంగాణ వచ్చినా శ్రీశైలం నిర్వాసితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలంటూ నినాదాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఏడాది దాటినా  నిర్వాసితులను పట్టించుకోకపోవ డం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీఓస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డిలు మాట్లాడుతూ శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.

ఈ నెల 20న మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి నుంచి వందలాది మంది నిర్వాసితులతో చేపట్టనున్న చలో అసెంబ్లీ పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రజాకవి రాజారాంప్రకాష్, విరసం సభ్యుడు రాంకి రామ్మోహన్‌లతోపాటు నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు కురుమన్న, ఉపాధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.
 
మహబూబ్‌నగర్‌కు అన్యాయం
అత్యంత అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు. కృష్ణానది ఎక్కువగా పారేది ఈ జిల్లాలోనే అయినా తాగు నీరు, సాగునీరు లేక వలసలతో వెలవెలబోతుంది. ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు గడచినా శ్రీశైలం ముంపు నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరుగలేదు.   
 - ఎం. మురళీధర గుప్తా,హైదరాబాద్  జిల్లా కన్వీనర్ , పాలమూరు అధ్యయన వేదిక .
 
ఆందోళనకు ముగింపు రావాలి
గత ప్రభుత్వాల దుర్మార్గానికి, మోసానికి బాధితులైన  నిర్వాసితులకు  ఎదురవుతున్న అ న్ని నియంత్రణలు, అడ్డంకులు తొలగించి ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి. అదే విధంగా 67 గ్రామాలలో సామాజిక నివేదికలు లేవు. దీనిపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి నివేదిక తయారు చేయించి గడువులో అమలు జరపాలి.    
- ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ .
 
వయసు మీరుతున్నా జాబ్ రాలేదు
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో మాతాతల నాటి నుంచి వస్తున్న సాగుభూమి 9.5 ఎకరాలు కోల్పోయా. మూడు దశాబ్దాల నుంచి నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో జీవిస్తున్నా. వయసు మీరిపోతోంది కానీ ఉద్యోగం రాలేదు. పౌరహక్కుల, ప్రజా సంఘాల నేతలు మా విషయంలో స్పందించి న్యాయం చే యాలి.     - పి.కురుమన్న, శ్రీశెలం ముంపు నిర్వాసితుల జిల్లా అధ్యక్షుడు.

మరిన్ని వార్తలు