ఫ్రంట్‌లో బొమ్మ పడాల్సిందే...!

13 Sep, 2015 01:10 IST|Sakshi
ఫ్రంట్‌లో బొమ్మ పడాల్సిందే...!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య పత్రికలపై విపరీతమైన కోపం వస్తోందట. తనకు అనుకూలంగా పుంఖానుపుంఖాలుగా నిత్యం వార్తలు వండే పత్రికలపైనే ఆయనకు కోపమొచ్చిందట. అదేంటి అంత అనుకూలంగా ఏర్చికూర్చి వార్తలు వండివార్చుతున్నా... బాబుగారికి ఎందుకు కోపమొస్తుందని ఇష్టమైన మీడియా ప్రతినిధులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందట. తనకు అనుకూలంగా వార్తలు రాస్తున్న పత్రికలు తన కుమారుడి విషయంలో అంత ప్రాధాన్యత ఇవ్వక పోవటమే ఆయన కోపానికి కారణమని తేలింది.

చంద్రబాబు కుమారుడు లోకేశ్ కార్యక్రమాలను పత్రికలు హైలైట్ చేయడం లేదని బాబు ఆగ్రహంతో ఉన్నారు. అదేంటి... బ్రహ్మాండంగా ప్రచారం కల్పిస్తున్నామే అని వాదిస్తున్న వారికి కూడా బాబుగారి నుంచి స్పష్టమైన సమాధానమే వచ్చిందట. తనకు ఇచ్చిన తరహాలోనే కుమారుడి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతతో మొదటి పేజీల్లో ఎందుకు ప్రచురించడంలేదని, లోపలి పేజీలకు పరిమితం చేస్తున్నారని, అదే బాబుగారి అసలు కోపానికి కారణమని సన్నిహితులు తేల్చారు. ఇంత చేస్తున్నా తన కుమారుడికి ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న విషయాన్ని పచ్చ పత్రికల పెద్దల ముందే అసంతృప్తిని వ్యక్తం చేశారట.

రాబోయే కాలంలో కాబోయే నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలని తాననుకుంటుంటే మీరు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా ప్రశ్నించారు కూడా. మీరు ముఖ్యమంత్రి కాబట్టి ప్రాధాన్యత ఇస్తున్నారని, మీ కుమారుడు కాదుకదా...! అని ఒక సన్నిహితుడు అన్న పాపానికి బాబుగారు ఇంతెత్తున లేచారు. ఏవేవో పనికిరాని వార్తలు ఫస్ట్ పేజీలో ప్రచురిస్తుంటారు. మా వాడి వార్తలు వేయరా...!! అంటూ క్లాస్ తీసుకోవడంతో పాటు చినబాబుగారి బాధ్యతంతా ఇప్పుడు ఆ పత్రికలపైన వేశారట...!

>
మరిన్ని వార్తలు