ఐదేళ్ల బాలికతో హత్య మిస్టరీ వీడింది!

18 Sep, 2016 19:44 IST|Sakshi
ఐదేళ్ల బాలికతో హత్య మిస్టరీ వీడింది!
బెంగళూరు: బెంగళూరులోని మిల్క్ మెన్ స్ట్రీట్లో ఇటీవల 29 ఏళ్ల సుప్రీత తన ఇంట్లో హత్యకు గురైంది. ఆమె భర్త రవిరాజ్ శెట్టీనే ఆ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అయితే రవిరాజ్ మాత్రం పొంతనలేని సమాధానాలతో పోలీసుల విచారణను తప్పుదోవపట్టించాడు. తన భార్య మానసికవ్యాధితో బాధపడుతోందని, ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని విచారణలో రవిరాజ్ చెప్పుకొచ్చాడు. హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోలేనని.. తన ఐదేళ్ల కూతురు రీతూ నిద్రిస్తుందని పోలీసులకు చెప్పాడు. దీంతో రీతూ సహాయంతో పోలీసులు కేసును చేదించారు.
 
హత్య అనంతరం తాతయ్య ఇంట్లో ఉంటున్న రీతూను విచారించడానికి మఫ్టీలో వెళ్లిన మహిళా పోలీసు అధికారి.. చాక్లెట్లు, బొమ్మలతో ముందుగా బాలికను మచ్చిక చేసుకొని విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అమ్మ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అని రీతూ చెప్పడం విశేషం. అమ్మ అసలు ఎలా గాయపడింది అని ప్రశ్నించగా.. 'నాన్న ఆ రోజు అమ్మను భుజాలపై కిచెన్లోకి తీసుకెళ్లాడు. తరువాత రక్తం మరకలతో బయటకు వచ్చాడు. అమ్మ కిచెన్లో కింద పడింది అని నాన్న చెప్పాడు' అని బాలిక జరిగింది జరిగినట్లుగా చెప్పింది. ఇదంతా రికార్డు చేసిన పోలీసులు బాలిక తండ్రి రవిరాజ్కు చూపించారు. ఇక చేసేదిలేక రవిరాజ్ హత్యానేరం అంగీకరించాడని ఉల్సూర్ పోలీసులు వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు