పెళ్లి చేసుకున్నాడు.. వెళ్లిపోయాడు

14 Sep, 2015 03:54 IST|Sakshi
పెళ్లి చేసుకున్నాడు.. వెళ్లిపోయాడు

♦ నా భర్తను నాకు అప్పగించండి
♦ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
 
 వేంపల్లె : ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. అతని తల్లిదండ్రులు పిలవడంతో పని ఉందని వెళ్లాడు.. తిరిగిరాలేదు.. నా భర్తను వారు బంధించారు.. నాకు అప్పగించి న్యాయం చేయాల’ని వేంపల్లె క్రిష్టియన్ కాలనీకి చెందిన చిట్వేలి సుప్రియ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యోగా, శారదల పెద్ద కుమార్తె సుప్రియ అలవలపాడు గ్రామానికి చెందిన చిలకల ప్రవీణ్ ప్రేమించుకున్నారు. జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఆయన ప్రియురాలిని వివాహం చేసుకొనేందుకు తన తల్లిదండ్రులను ఒప్పించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. మరోవైపు సుప్రియ తల్లిదండ్రులను ఒప్పించింది.

ఈ క్రమంలో తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుంటానని ప్రవీణ్ ముందుకు రావడంతో ఈ నెల 10న కడప చిన్నచౌకులోని చర్చిలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. మరుసటి రోజు ఇంటి నుంచి ప్రవీణ్‌కు ఫోన్ రావడంతో వెళ్లి వస్తానని చెప్పాడు. తిరిగి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలియజేసింది. తల్లిదండ్రులు బంధించి తన వద్దకు రాకుండా చేశారని వాపోయింది. ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు