కృష్ణ పెద్ద తప్పు చేశాడు!

22 Mar, 2017 12:41 IST|Sakshi
కృష్ణ పెద్ద తప్పు చేశాడు!

ఇంతటి వృద్ధ వయస్సులోనూ సిద్ధాంతాలను పక్కనబెట్టి పార్టీ మారడం ద్వారా కర్ణాటక మాజీ సీఎం, సీనియర్‌ నేత ఎస్‌ఎం కృష్ణ పెద్ద తప్పు చేస్తున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీలో చేరాలన్న ఆయన నిర్ణయం తమను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌ ఆయనకు అన్ని పదవులు ఇచ్చి.. అన్ని రకాలుగా గౌరవించిందని పేర్కొన్నారు.

’ఆయనకు పార్టీ అన్ని ఇచ్చింది. అన్ని రకాల పదవులు, గౌరవాలు పొందిన అతికొద్దిమంది కాంగ్రెస్‌ నేతల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదు’  అని కాంగ్రెస్‌ నేత ఖర్గే అన్నారు. ’ 50 ఏళ్లుగా అనుసరిస్తున్న భావజాలపరమైన సిద్ధాంతాలను ఆయన మార్చుకోవడానికి కారణం ఏమిటో నాకు తెలియదు. ఇంకా జీవితంలో కొన్నిరోజలు మాత్రమే మిగిలి ఉన్న దశలో ఆయన నమ్మిన సిద్ధాంతాలను వదులుకోవడం ద్వారా పెద్ద తప్పు చేస్తున్నారు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీలో ఉండి అనేక పదవులు చేపట్టిన ఎస్‌ఎం కృష్ణ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు