అత్యంత లగ్జరీ, కాస్ట్లీ ఫోన్లను తయారుచేసే వర్చ్యూ సంస్థ తన తాజా మోడల్ను విడుదల చేసింది. ‘వర్చ్యూ సిగ్నేచర్ కొబ్రా’ పేరిట రూపొందిన ఈ ఫోన్ ధర అక్షరాల 2.3 కోట్ల రూపాయలు (3.60 లక్షల డాలర్లు). పేరుకు తగ్గట్టే ఈ ఫోన్ అంచుల చుట్టు ఓ పాము ప్రతిమను ముద్రించి ఉండటం ఇందులోని ప్రత్యేకత. 439 కెంపులను పొదిగి ఈ ఫీచర్ ఫోన్ను రూపొందించారు. ఇక పాము కళ్లుగా ఎమరాల్డ్స్ను (మరకత మణులను) పొదిగారు.
288 భాగాలతో రూపొందిన ఈ ఫోన్ యూకేలో తయారు చేశారు. కేవలం ఎనిమిది యూనిట్ల ఫోన్ను మాత్రమే తయారుచేశారు. ఈ ఫోన్ కొనాలని ఆసక్తి కలిగిన వాళ్లు చైనీస్ ఈ-కామర్స్ వెబ్సైట్ జేడీ.కామ్లో బుక్ చేసుకోవచ్చు. 145 డాలర్లు అదనంగా చెల్లించి ప్రీ-బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్లో మిగతా స్మార్ట్ఫోన్ ఫీచర్లు మామూలుగానే ఉన్నాయి. రెండు అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమరీ, ఐదున్నర గంటలసేపు ఫోన్ చేసి మాట్లాడుకోగల బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉన్నాయి.