అఖిలేష్‌, ప్రతీక్.. నాకు రెండు కళ్లు

19 Feb, 2017 14:10 IST|Sakshi
అఖిలేష్‌, ప్రతీక్.. నాకు రెండు కళ్లు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మూడో దశ ఎన్నికల్లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ములాయం, ఆయన భార్య సాధన గుప్తా.. కుమారులు అఖిలేష్‌ యాదవ్, ప్రతీక్ యాదవ్.. కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ ఓటు వేశారు.

సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే సాధనా గుప్తా.. ఓటు వేసిన అనంతరం కాసేపు విలేకరులతో మాట్లాడారు. అఖిలేష్‌, ప్రతీక్ ఇద్దరూ తనకు రెండు కళ్లలాంటివారని అన్నారు. తమ కుటుంబమంతా ఒక్కటేనని చెప్పారు. అఖిలేష్.. ములాయం మొదటి భార్య కొడుకు కాగా, ప్రతీక్.. ములాయం రెండో భార్య సాధన కొడుకు. అఖిలేష్ భార్య డింపుల్ కనౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రతీక్ భార్య అపర్ణ లక్నో కంటోన్నెంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆ మధ్య ములాయం ఇంట్లో, ఎస్పీలో ఆధిపత్య పోరు సాగినపుడు ఆయన కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. సాధన, అపర్ణ, ములాయం సోదరుడు శివపాల్‌ ఒకవైపు.. అఖిలేష్, ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మరో వైపు ఉన్నట్టు కథనాలు వినిపించాయి. విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చిన ములాయం కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో తామంతే ఒక్కటేనని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు