టీఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోవడమే మంచిది: రేణుకాచౌదరి

6 Mar, 2014 01:40 IST|Sakshi
టీఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోవడమే మంచిది: రేణుకాచౌదరి

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ విలీనం, పొత్తు ఉండవని తేలిపోయిందని.. ఇక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘అంతా మన మంచికే. టీఆర్‌ఎస్ వాళ్లు మాతో వచ్చినా రాకపోయినా ఇబ్బందేమీ లేదు. మేం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.

 

ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది’’ అని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించడంతో పాటు కేసీఆర్‌కి దీటైన సమాధానం చెప్పే నాయకుడినే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని రేణుక అభిప్రాయపడ్డారు. ఈ సారి తాను ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు