గ్యాస్‌కు మార్కెట్ ధరే కరెక్ట్

4 Dec, 2013 01:30 IST|Sakshi
గ్యాస్‌కు మార్కెట్ ధరే కరెక్ట్

న్యూఢిల్లీ: ఏడేళ్లలో ప్రపంచంలోనే మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా ఇండియా అవతరించనున్న నేపథ్యంలో గ్యాస్‌కు మార్కెట్ ఆధారిత ధరల విధానమే తగినదని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. భారీ స్థాయిలోని దేశ అవసరాలను తీర్చాలంటే తగిన సాంకేతికత కూడా అవసరమని చెప్పారు. ఇక్కడ ఫిక్కీ, గెయిల్ నిర్వహణలో ఏర్పాటైన 8వ ఆసియా గ్యాస్ సదస్సుకు హాజరైన ప్రధాని ప్రసంగిస్తూ ప్రస్తుతం ఇండియా అంతర్జాతీయ స్థాయిలో ఏడో పెద్ద ఇంధన ఉత్పత్తిదారుగా నిలుస్తున్నదని తెలి పారు.
 
 అయితే రానున్న రెండు దశాబ్దాలలో ఇంధన సరఫరాను మూడు నుంచి నాలుగు రెట్లు పెంచాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. దేశీయ ఇంధన అవసరాలలో చమురు, గ్యాస్‌లకు 41% వాటా ఉన్నదని చెప్పారు. 2,020కల్లా ఇండియా మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా నిలవనున్నదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన దేశం అమెరికా, చైనా, జపాన్‌ల తరువాత ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఇంధన వినియోగదారుగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. వెరసి గిరాకీ, సరఫరాల మధ్య సమతౌల్యాన్ని సాధించేందుకు వీలుగా ఇంధన వెలికితీతలో దేశ, విదేశీ కంపెనీలను ప్రోత్సహించాల్సి ఉన్నదని వివరించారు.
 
 యూఎస్ షేల్ గ్యాస్ ఆదర్శం
 ఇంధన ఉత్పత్తిని పెంచడంలో అమెరికా షేల్ గ్యాస్ విప్లవాన్ని ప్రధాని ఉదహరించారు. మార్కెట్ ఆధారిత విధానాలు, సాంకేతికతల ద్వారా సంప్రదాయేతర వనరులను వెలికితీయడంలో అమెరికా బాగా విజయవంతం అయిం దని చెప్పారు. దీంతో ఇంధన నిల్వలు(మిగులు) కలిగిన దేశంగా అవతరించిందని చెప్పారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఇండియావంటి దేశాల ఇంధన అవసరాలకు ఇలాంటి విధానాలు అవసరమని వ్యాఖ్యానించారు. ఇంధన భద్రతను సాధించే దిశలో ఇండియా కూడా పలు ఇతర అవకాశాలను పరిశీలిస్తున్నదని చెప్పారు. ఈ బాటలోనే ఇతర దేశాల్లోని ఇంధన ఆస్తులను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.  
 
 80% దిగుమతులే...
 దేశ చమురు అవసరాల్లో 80% దిగుమతుల ద్వారానే లభిస్తోంది. ఇదే విధంగా 50% గ్యాస్ సరఫరాను కూడా దిగుమతుల ద్వారానే అందుకుంటోంది. ముడిచమురు విషయంలో మార్కెట్ ధరను ఆధారం చేసుకుంటున్నప్పటికీ, గ్యాస్ విషయంలో ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. అయితే వచ్చే ఏడాది(2014) ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరను దాదాపు రెట్టింపునకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కున్న విషయం విదితమే. దీంతో గ్యాస్ ధర ఒక ఎంబీటీయూకి 8.4 డాలర్లవరకూ పెరగనుంది. కొత్త మార్గాల ద్వారా ఇంధనాన్ని వెలికితీసే కంపెనీలకు మద్దతిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని గ్యాస్ ధర పెంపు ద్వారా నమ్మకాన్ని కలిగించనున్నట్లు ప్రధాని చెప్పారు.  కొనుగోలుదారులు, విక్రయదారుల మధ్య ధర విషయంలో భారీ అంతరాలుంటే తగిన స్థాయిలో ఇంధనం లభించదని, దేశీయంగా గ్యాస్‌కున్న భారీ గిరాకీ దృష్ట్యా ఇండియా వంటి దేశాలలో ఇది సమస్యలు సృష్టిస్తుందని విశ్లేషించారు.
 
 దభోల్-బెంగళూరు పైప్‌లైన్ ప్రాజెక్ట్ జాతికి అంకితం
 మహారాష్ర్టలోని దభోల్ , కర్ణాటకలోని బెంగళూరు మధ్య గెయిల్ ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం జాతికి అంకితం చేశారు. 1,000 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్‌లైన్‌ను రూ. 4,500 కోట్లతో  గెయిల్ అభివృద్ధి చేసింది. 8వ ఆసియా గ్యాస్ సదస్సుకు మన్మోహన్‌తోపాటు, ఆయిల్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ కూడా హాజరయ్యారు. మహారత్న స్థాయిని అందుకున్న గ్యాస్ దిగ్గజం గెయిల్ మంచి పనితీరును చూపుతున్నదని ఈ సంద ర్భంగా ప్రధాని ప్రశంసించారు. ఈ పైప్‌లైన్ ద్వారా జాతీయ గ్రిడ్‌కు తొలిసారి దక్షిణాది అనుసంధానమైందని గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠీ పేర్కొన్నారు. పైప్‌లైన్ ద్వారా రోజుకి 1.6 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్‌ఎండీ) గ్యాస్‌ను సరఫరా చేయవచ్చు.

మరిన్ని వార్తలు