'నా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు'

18 Aug, 2015 16:38 IST|Sakshi
'నా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు'

హైదరాబాద్: నగరిలో తన విజయాన్ని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు జీర్ణించుకోలేపోతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నగరి ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పటి నుంచి ఆయన.. తనను, తమ పార్టీ వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. నగరి మున్సిపల్ చైర్పర్సన్, వైఎస్ఆర్ సీపీ నేత శాంతకుమారి కుటుంబ సభ్యులపై పోలీసులు దౌర్జన్యం చేసిన ఘటన గురించి మానవ హక్కుల సంఘానికి రోజా ఫిర్యాదు చేశారు. మంగళవారం శాంతకుమారితో కలసి రోజా హెచ్ఆర్సీ కార్యాలయానికి వెళ్లారు.

అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. నగరిలో పోలీసులు అధికార టీడీపీకి తొత్తులుగా మారారని విమర్శించారు. పోలీసులు మున్సిపల్ చైర్పర్సన్ ఇంటి గేట్లు పగలగొట్టి ఆమె కుటుంబ సభ్యులను లాక్కుపోయారని చెప్పారు. అడ్డుకున్న మహిళలను బూతులు తిట్టారని తెలిపారు. దౌర్జన్యం చేసిన సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరినట్టు చెప్పారు. తనకు, శాంతకుమారి కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరినట్టు రోజా వెల్లడించారు.  ఈ కేసు విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు