'ఫేస్ బుక్' వ్యసనం చంపేసింది!

29 Oct, 2013 15:11 IST|Sakshi
'ఫేస్ బుక్' వ్యసనం చంపేసింది!
ఉదయాన్నేలేచి అద్దంలో ఫేస్ చూసుకోకున్నా.. ఫేస్ బుక్ చూసుకోవడం నెటిజన్లకు అలవాటైపోయింది. ఇంటర్నెట్ వినియోగం అన్నివర్గాలకు చేరువ కావడంతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం చాలా సులభమైంది. సమాచార ప్రసార ప్రక్రియలో  ఇంటర్నెట్ తో అనుసంధానమైన ఎన్నో సమాచార సాధనాలు నెటిజన్లకు వరప్రసాదమయ్యాయి. ఇంటర్నెట్ సాధించిన పురోగతితో ఈమెయిల్, సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సాధనాలు యువతకు, ఉద్యోగులకు, ఇతర వర్గాలకు మరింత దగ్గరయ్యాయి. గతంలో దూమ, మద్యపానం, జూదం లాంటివి వ్యసనాలుగా ఉండేవి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు అడిక్ట్ (వ్యసనం) గా మారిందని తరచు వింటూనే ఉన్నాం. 
 
అయితే ఇటీవల సోషల్ మీడియా కారణంగా చోటు చేసుకున్న సంఘటనలు ఆందోళనకు గురిచేసాయి. చెన్నైలో సాఫ్ట్ వేర్ నిపుణుడి భార్య ఫేస్ బుక్ లో తమ పెళ్లి ఫోటోలు అప్ లోడ్ చేయడం వివాదంగా మారింది. ఫేస్ బుక్ నుంచి ఫోటోలు తొలగించాలని చేసిన విజ్ఞప్తిని భార్య నిరాకరించడంతో సాఫ్ట్ వేర్ నిపుణుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలోని పర్భని లో ఓ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటనకు కారణం ఆ యువతిని తల్లి తండ్రులు ఫేస్ బుక్ వినియోగించకూడదు అని చెప్పడమే. ఇలాంటి సున్నితమైన సంఘటనలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వల్ల వివాహపరమైన సమస్యలు తలెత్తి.. విడాకుల వరకు దారి తీస్తున్నాయని సర్వేలు వెల్లడించాయి. ఇలాంటి సంఘటనల్లో ఏ ఒక్కరిని తప్పుపట్టడమనేది పక్కన పెడితే..
 
ఓటర్, ఆధార్ ఐడీ కార్డులు లేకున్నా పర్వాలేదు.. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో యూజర్ ఐడీ ఉంటే చాలు అనే పరిస్థితి అన్ని వర్గాల్లో కనిపిస్తుంది. ఫేస్ బుక్, ట్విటర్ లాంటి మీడియా ప్రభావం అన్ని వర్గాలపైన పడుతోంది. ఫేస్ బుక్, ట్విటర్ లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం దినసరి అలవాటుగా మారింది. ఒకనాడు ఇంట్లో ఆల్బమ్ లకే పరిమితమయ్యే వ్యక్తిగత, కుటుంబ ఫోటో ఆల్బమ్ లు ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లకు ఎక్కడం నాగరికతలో భాగమైంది. సమాచారాన్ని చేరవేయడం, ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టి.. తమ అనుభవాలను పంచుకోవడం దినచర్యలో భాగమైంది. 
 
సోషల్ మీడియా అక్కడికే పరిమితం కాకుండా ఎన్నికల ప్రచారంలోనూ భాగమైంది. దేశంలోని చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల భవిష్యత్ ను నిర్ణయించే శక్తిగా సోషల్ మీడియా ప్రభావం చూపుతోందని తాజాగా వెల్లడైన సర్వే సమాచారం.  సోషల్ మీడియాలో ఉండే బయోడేటా, వ్యక్తుల అభిరుచులను బేరిజు వేసి కొన్ని కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇలాంటి మరెన్నో అంశాలపై ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లు ప్రభావం చూపుతున్నాయి. సోషల్ మీడియా జీవితంలో ఓ భాగమైంది అనే విషయం కాదనలేనిది. సోషల్ మీడియా ప్రభావం వల్ల కొన్ని సానుకూల, ప్రతికూల అంశాలు వెలుగుచూస్తున్నాయి.  సోషల్ మీడియా వినియోగం వారి వారి విజ్క్షత, అవసరాలకు పరిమితం కావాల్సిందే కాని.. ఈ వ్యసనంతో వ్యక్తులు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంతమాత్రం సబబు కాదని అన్ని వర్గాల్లో నెలకొని ఉంది. 
>
మరిన్ని వార్తలు