పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక విద్య

29 Jan, 2016 04:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచేం దుకు, సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రత్యేకంగా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్(ఎన్‌ఎస్‌క్యూఎఫ్)ను రూపొందించి వొకేషనల్ విద్యను ప్రవేశపెట్టిన కేంద్రం ఇప్పుడు సాంకేతిక విద్యా కోర్సులను కూడా పాఠశాలస్థాయి నుంచే ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. కళాశాల స్థాయి వరకు ఆయా కోర్సులను అనుసంధానం చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్(కేబ్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఇప్పటివరకు అమలు చేస్తున్న వృత్తి విద్యాకోర్సులను పరిశీలించి, భవిష్యత్తులో ఉండాల్సిన కోర్సులను పకడ్బందీగా రూపొందించేందుకు కేబ్ వివిధ రాష్ట్రాల మంత్రులతో కూడిన సబ్‌కమిటీని ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మానవ వనరుల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ రామ్ శంకర్ కఠారియా చైర్‌పర్సన్. మరోవైపు ఇటీవల ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) డెరైక్టర్లతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించింది. మోడల్ స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న వృత్తి విద్యా కోర్సులను అన్ని ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది.
 
సబ్ కమిటీ ఏం చేయాలంటే..
* ప్రస్తుతం అమల్లో ఉన్న వృత్తి, సాంకేతిక విద్యా విధానం, వాటిని పాఠశాలలు, ఉన్నత విద్యా కోర్సుల తో అనుసంధానం చేసే అంశాలపై అధ్యయనం చేయాలి.
* వివిధ రాష్ట్రాల్లో స్కిల్, సాంకేతిక విద్య అమలులో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను రాష్ట్రాలవారీగా పరిశీలించాలి. వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించాలి.
* ప్రస్తుతం ఉన్న నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలు, కోర్సులు, వృత్తి విద్యా, శిక్షణా కోర్సులను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించాలి.
* ఇప్పటివరకు అమలు చేస్తున్న వృత్తి విద్యా కోర్సులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా? వాటిల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న అంశాలపై నివేదిక అందజేయాలి.
* పరిశ్రమల భాగస్వామ్యం పెం చాలి. పరిశ్రమల్లో శిక్షణా కార్యక్రమాలు చేపట్టేలా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించాలి.

మరిన్ని వార్తలు