అజిత్‌ ‘వివేగం’కు ధీటుగా ‘తప్పాట్టం’ వసూళ్లు

26 Aug, 2017 20:59 IST|Sakshi

చెన్నై: సీనియర్‌ హీరో అజిత్‌ కుమార్‌ సినిమా వస్తుందంటే.. ఒక మోస్తరు చిత్రాల విడుదల సైతం నిలిచిపోయే పరిస్థితి. అలాంటిది ఓ కొత్త నిర్మాత.. కొత్త దర్శకుడు, నూతన నటీనటులతో రూపొందించిన సినిమాను అజిత్‌ సినిమాకు పోటీగా వుడుదల చేయడం, అదికాస్తా బిగ్‌ హీరోకు ధీటుగా వసూళ్లు రాబట్టడం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఆ సినిమా పేరు.. తప్పాట్టం. గత గురువారం అజిత్‌ చిత్రం వివేగంతో పాటు విడుదలైన తప్పాట్టం చిత్రానికి విమర్శకుల ప్రశంసలతోపాటు విపరీతమైన ప్రేక్షకాదరణా లభిస్తోంది.

‘తప్పాట్టం’లో పబ్లిక్‌ స్టార్‌ దురై సుధాకర్‌ హీరోగా నటించగా, ఆయనకు జంటగా డోనా మెప్పించారు. కోవై జయకుమార్, పేనామణి, కూత్తుపట్టరై తులసి, పేరాసిౖయె లక్ష్మి, రూఫి, పొల్లాచ్చి ఎంకే.రాజా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. నవ దర్శకుడు ముజిపూర్‌ రహ్మాన్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఆదంబావా నిర్మించారు. 1984లో ఒక కుగ్రామంలో జరిగే కథగా తెరకెక్కించిన తప్పాట్టం చిత్రాన్ని దర్శకుడు చాలా సహజత్వంతో రూపొందించారు.

కథేంటి? చావులకు డప్పులు వాయించే ఒక యువకుడికి, అతడిని పిచ్చిగా ప్రేమించే అక్క కూతురికి మధ్య ప్రేమ, పెళ్లి, ఈ గ్రామంలో ఒక మోతుబరు రైతు ఇలా సాగుతుంది కథ. కంటపడిన యువతుల్ని కాంక్షించే ఆ మోతుబరి రైతు బారిన కథానాయకి పడుతుంది.ఆమె అతని నుంచి తప్పించుకోవడంతోపాటు అతని చెంప ఛెళ్లుమనిపిస్తుంది. ఆ పగతో రగిలే ఆ మోతుబరి రైతు ఏం చేశాడు, అందుకు చిత్ర కథానాయకుడి రియాక్షన్‌ ఏమిటి? తదితర ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తప్పాట్టం.

మరిన్ని వార్తలు