పాల దిగుబడి పెరగాలంటే...

1 Aug, 2014 22:33 IST|Sakshi
పాల దిగుబడి పెరగాలంటే...

పాడి-పంట: గుడ్లవల్లేరు (కృష్ణా) : పశు పోషణ విషయంలో చాలా మంది రైతులు నేటికీ సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. పాడి పశువులకు పోషక విలువలతో కూడిన దాణాను అందించలేకపోతున్నారు. ఫలితంగా దేశవాళీ గేదెలు గరిష్ట స్థాయిలో పాల ఉత్పాదక సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. పాడి పశువుల నుంచి అధిక పాల దిగుబడిని పొందాలంటే పుష్టికరమైన మేపును అందించాల్సిందే. అంటే వరిగడ్డితో పాటు సమీకృత దాణానూ ఇవ్వాలి. అప్పుడే దేశవాళీ గేదెల్లో ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చునని చెబుతున్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ బి.సత్యప్రసాద్. ఆ వివరాలు...
 
దాణా ఎలా ఉండాలి?

 పాల ఉత్పత్తి సమయంలో, చూడి దశలో, పెరుగుదల దశలో పశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి. అంటే పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి. ఆ మిశ్రమాన్నే దాణా అంటారు. ఇందులో జీర్ణమయ్యే మాంసకృత్తులు, పూర్తిగా జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దాణాలో మాంసకృత్తులు 16 శాతం, జీర్ణమయ్యే పోషక పదార్థాలు 70 శాతం ఉండేలా వివిధ దినుసులు, పదార్థాలను కలుపుకోవాలి.
 
ఎంత ఇవ్వాలి?
 సాధారణంగా చాలా మంది రైతులు పశువులకు దాణాగా తౌడును వేస్తుంటారు. సమీకృత దాణా తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువ కావడమే దీనికి కారణం. అయితే మాంసకృత్తులు, పోషకాలు, ఖనిజ లవణాలు తగు పాళ్లలో ఉండే సమీకృత దాణాను అందిస్తే పశువులో పాల దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రెండు లీటర్లకు పైబడి పాలిచ్చే పశువులకు తప్పనిసరిగా సమీకృత దాణాను ఇవ్వాలి. పాలిచ్చే గేదెలైతే ప్రతి రెండు లీటర్లకు కిలో చొప్పున రోజుకు ఏడు కిలోలకు మించకుండా దాణాను అందించాలి. పాలిచ్చే ఆవులకు ప్రతి 2.5 లీటర్లకు ఒక కిలో చొప్పున దాణా ఇవ్వాలి.
 
తాజాగా ఉండాలి
 పశువులకు అందించే దాణా తాజాగా ఉండాలి. అంటే దానిని ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కలుపుకోవాలి. గాలి చొరబడని డబ్బాలు లేదా సంచులలో దాణాను నిల్వ చేసుకోవాలి. దాణా తయారీలో వినియోగించే గింజలను చెక్క ముక్కగా ఆడించాలి. వాటిని ముందుగానే ఆడించి నిల్వ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గింజలపై ఉన్న పొరలు ఊడిపోయి చీడపీడలు సులభంగా ఆశిస్తాయి.  
 
జాగ్రత్తలు తీసుకోవాలి
 దాణాను తయారు చేసేటప్పుడు పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా చూసుకోవాలి. ముఖ్యం గా తక్కువ పరిమాణంలో వాడే ఖనిజ లవణ మిశ్రమాన్ని దాణాలో కలిపేటప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే దానిని దాణాలో కలపకుండా పశువుకు అందించే ఆహారాన్ని బట్టి రోజువారీగా విడిగా ఇవ్వడం మంచిది. దాణా తయారీకి ఉపయోగించే పదార్థాలు బాగా ఎండి, పెళుసుగా ఉండాలి. వాటిలో తేమ 5 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. తేమ ఎక్కువైతే మొక్కజొన్న, వేరుశనగ, సోయా పిండ్లు బూజు పడతాయి. అప్పుడు దాణాలో అప్లోటాక్సిన్ అనే విష పదార్థం  చేరుతుంది. బూజు పట్టిన మొక్కజొన్న గింజలు నల్లగా మారతాయి. అలాంటి వాటిని దాణా తయారీకి ఉపయోగించకూడదు. నాణ్యమైన గింజలనే వాడాలి. వేరుశనగ, సోయా గింజలపై శిలీంద్రాలు (ఫంగస్) ఉన్నాయేమో చూసుకోవాలి. ఆ గింజలను చిన్న చిన్న ముక్కలుగా విరి చి, అంచులను పరిశీలిస్తే నాణ్యంగా ఉన్నాయా లేదా అన్న విషయం అర్థమవుతుంది.
 
పత్తి పిండిని మరీ ఎక్కువగా... అంటే 10 శాతానికి మించి వాడకూడదు. ఎందుకంటే దానిలో గోస్పీపోల్ అనే విష లక్షణం ఉంటుంది. ఉప్పు కలపని ఖనిజ లవణ మిశ్రమాన్ని కొనడం మంచిది. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. అయొడైజ్డ్ ఉప్పును వాడడం వల్ల పశువులకు పునరుత్పత్తికి దోహదపడే అయొడిన్ అందుతుంది.
 
 ఇలా చేయండి
 100 కిలోల సమీకృత దాణాను తయారు చేసుకోవాలంటే 25-30 కిలోల బియ్యం/గోధుమ తౌడు, 30-40 కిలోల మొక్కజొన్న/జొన్న గింజల పిండి, 20-30 కిలోల వేరుశనగ/తెలగ/పత్తి/కొబ్బరి తెలగ పిండి, కిలో ఉప్పు, రెండు కిలోల ఖనిజ లవణ మిశ్రమంతో పాటు 20 కిలోల వరకూ ఉలవలు/శనగపొట్టు/కందిపొట్టు/కర్రపెండలం పిప్పి అవసరమవుతాయి. లభ్యత, ధరను దృష్టిలో ఉంచుకొని అనువైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. ధాన్యపు గింజలు పశువుకు శక్తినిస్తాయి. ఎందుకంటే వీటిలో పోషకాలు, మాంసకృత్తులు ఉంటాయి. తౌడు ద్వారా పశువులకు జీర్ణమయ్యే పోషకాలు, మాంసకృత్తులతో పాటు విటమిన్లు, భాస్వరం, పీచు పదార్థాలు కూడా లభిస్తాయి. పిండి ద్వారా మాంసకృత్తులు, అదనపు శక్తి చేకూరుతాయి. దాణాలో తగినంత మొలాసిస్ కలిపితే మంచి రుచి వస్తుంది. పశువులకు శక్తి కూడా లభిస్తుంది. ఖనిజ లవణాలు పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంద కిలోల దాణా కోసం 30 కిలోల తౌడు (నూనె తీసిన), 37 కిలోల గింజలు, 22 కిలోల తెలగ పిండి, 8 కిలోల పత్తి పిండి, 2 కిలోల ఖనిజ లవణాలు, కిలో ఉప్పు కలుపుకున్నా సరిపోతుంది.

మరిన్ని వార్తలు