ఖరీఫ్ పంటలు.. ప్రస్తుత యాజమాన్య పద్ధతులు

21 Sep, 2014 23:45 IST|Sakshi

కందుకూరు: ఈ ఖరీప్ పంట కాలంలో ప్రస్తుతం జిల్లా పరిధిలో సాగవుతున్న పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కంది ముఖ్యమైనవి. ఈ తరుణంలో సాగవుతున్న ఆయా ప్రధాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డా.సీహెచ్.చిరంజీవి, డా.పి.అమ్మాజీ, డా.ఎన్.ప్రవీణ్ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు.

 వరి పంటలో..
 ప్రస్తుతం వరి పంట దుబ్బు చేసే దశలో ఉంది. ఈ సమయంలో రెండో దఫా వేయాల్సిన నత్రజని ఎరువులను వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులను దుబ్బు చేసే సమయంలో గాని అంకురం ఏర్పడే దశలో గాని వేయకూడదు. జిల్లాలోని కొన్ని మండలాల్లో జింకు ధాతు లోపం ఉంది. ఈ ధాతు లోపం వచ్చినప్పుడు ఆకులపై ఇటుక రంగు మచ్చలేర్పడతాయి. మొక్క దుబ్బు చేయదు. జింకు ధాతు లోపం గమనించినప్పుడు లీటర్ నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటును కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు, మూడుసార్లు పిచికారీ చేస్తే ఈ లోపాన్ని నివారించవచ్చు.

 పత్తిలో..
 పత్తి విత్తిన తొలి దశలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పెరుగుదల కొంత వరకు తగ్గినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలతో పంట ప్రస్తు తం పూత, గూడు, కాత దశలో ఉంది. పత్తిలో రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తెల్ల దోమ, తామర పురుగులు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ధయోమిథాక్సామ్ 0.2 గ్రా, లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇటీవల ధారూరు, తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని మండలాల్లో 15-20 రోజులుగా తరచూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భూమిలో తేమ అధిక మై వేరుకుళ్లు తెగులు, వడలు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది.

ఈ తెగులు ఆశించినప్పుడు లేత మొక్కలు అర్ధాంతరంగా చనిపోతాయి. ఈ తెగులు ఉధృతిని తగ్గించడానికి 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 20 గ్రా. స్ప్రింట్‌ను 10 లీటర్ల నీటికి కలిపి ఈ ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. ప్రస్తుతం తరచుగా వర్షాలు కురవడం, మబ్బులు పట్టిన వాతావరణ పరిస్థితుల్లో నల్లమచ్చ తెగులు కూడా సోకే అవకాశం ఉంది. ఈ తెగులు సోకినప్పుడు మొదట ఆకుల మీద కోణాకారపు మచ్చలు ఏర్పడతాయి. దీనినే బ్లాక్ ఆర్మ్ అంటారు. దీని నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్, 1 గ్రా. పౌషామైసిన్ లేదా ప్లాంటోమైసిన్ మందును కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

 కంది..
 ప్రస్తుతం కంది పంటలో ఎండు తెగులు చాలా ప్రాంతాల్లో సోకింది. తరచుగా పడుతున్న వ ర్షాల కారణంగా పొలంలో నీరు నిలబడే అవకాశం ఉంటుంది. అధికంగా ఉన్న నీటిని పొలం నుంచి బయటకు పంపించి తేమ ఆరిన త ర్వాత దంతెలతో అంతర కృషి చేసుకోవాలి. ఈ తెగులు నివారణకు ఎటువంటి మందులు లేవు. ఎండు తెగులు సోకిన పొలాల్లో జొన్న పంటతో పంట మార్పిడి చేసుకోవాలి. తెగులు  తో ఎండిపోయిన మొక్కలను పీకి వేయాలి.
 
మొక్కజొన్న..
 ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో మొక్కజొన్న సా గు విస్తీర్ణం సాధారణం కంటే తగ్గింది. ప్రసు ్తతం మొక్కజొన్న కండె ఏర్పడే దశలో ఉంది. ఈ దశలో చివరి మోతాదుగా ఎకరాకు 40 కి లోల యూరియా 15 కిలోల పొటాష్‌ను కలిపి మొక్క వేరు వ్యవస్థకు దగ్గరగా వేసుకోవాలి.

మరిన్ని వార్తలు