‘ఉద్యానం’.. బహు లాభదాయకం

17 Sep, 2014 02:40 IST|Sakshi

నిజామాబాద్ వ్యవసాయం : పండ్ల తోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన శాఖ జాయింట్ డెరైక్టర్ శామ్యూల్ సూచించారు. పండ్ల తోటల పెంపకంతో అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి తోటల పెంపకానికి ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. వీటిని ఉపయోగించుకొని లబ్ధిపొందాలని సూచించారు. ఉద్యాన పంటల అభివృద్ధి పథకాల గురించి ఆయన వివరిం చారు. తోటల పెంపకంపై ఆసక్తిగల రైతులు ఉద్యాన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 మామిడి
 మొక్కలు, జీవ, రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చులో 40 శాతం రాయితీ ఇస్తోంది. మూడేళ్లలో అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీ రూ. 6,560కి(ఎకరానికి) మించకుండా లభిస్తుంది. ఒక రైతు పది ఎకరాల వరకు రాయితీకి అర్హుడు. రైతులు తోటకు ఉపయోగించిన మందులు తదితర వివరాలతో ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే రాయితీ మొత్తాన్ని ఆ రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
 
అరటి
 అరటి సాగుకు సైతం 40 శాతం రాయితీ  లభిస్తుంది. ఎకరం విస్తీర్ణంలో మొక్కలు, జీవ, రసాయన ఎరువులు, పురుగు మందులకు రెండేళ్లలో అయ్యే ఖర్చులో 40 శాతం(రూ. 16,394 మించకుండా) రాయితీ మొత్తాన్ని సదరు రైతు ఖాతాలో జమ చేస్తారు.
 
బొప్పాయి
 బొప్పాయికి 40 శాతం (గరిష్టంగా రూ. 9,865) రాయితీ లభిస్తుంది. ఒక రైతు పది ఎకరాల వరకు రాయితీ పొందడానికి అర్హుడు.
 
మామిడి తోటల పునరుద్ధరణ
 రోగాల బారిన పడిన లేదా కాతకాయనటువంటి పాత మామిడి తోటలను పునరుద్ధరించడానికి సైతం ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. మొక్కలు, ఎరువులు, పురుగు మందులు, పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు లో 50 శాతం (ఎకరానికి రూ. 6 వేలు) రాయితీ ఇస్తారు.
 
బంతిపూలు
 సాగుకు అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీ (గరిష్టంగా ఎకరానికి రూ.4 వేలు) ఇస్తారు.

>
మరిన్ని వార్తలు