‘పొద్దు’ తిరుగుతోంది

18 Aug, 2014 02:02 IST|Sakshi

 జిల్లాలో గతంలో సుమారు 30 వేల హెక్టార్లలో పొద్దు తిరుగుడు సాగయ్యేది. కానీ రైతులు ఇటీవలి కాలంలో ఈ పంట సాగును తగ్గించారు. గతేడాది ఖరీఫ్‌లో ఎనిమిది వేల హెక్టార్లలోనే సన్‌ఫ్లవర్ సాగయ్యింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతుండడంతో ఈసారి సుమారు 15 వేల హెక్టార్లలో ఈ పంట సాగు కావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
 
 ఈ నేలలు అనుకూలం
నీరు నిల్వ ఉండని తటస్థ నేలలైన ఎర్ర, చెలక, రేగడి, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల కంటే కొంచెం క్షార లక్షణాలు కలిగిన నేలల్లో పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది.

భూమిలో ఆమ్ల లక్షణాలు ఉంటే విత్తనం మొలకెత్తే స్వభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణం మొక్కలో పటుత్వాన్ని తగ్గిస్తుంది. నూనె శాతం కూడా తగ్గుతుంది.

పొద్దు తిరుగుడు మొక్కలు అధిక తేమ శాతాన్ని తట్టుకోలేవు. అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేయవద్దు.
 సాగునేల తయారీ
భూమిని నాలుగైదుసార్లు దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి.

మధ్యస్థ, బరువు నేలల్లోనైతే బ్లేడ్‌తో ఒకటిరెండు సార్లు కలియదున్నాలి.

చదను చేసిన అనంతరం బోదేలు చేసి విత్తనం నాటాలి.
 
విత్తన శుద్ధి
ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం.

విత్తనాలను ముందు 14 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి, విత్తే ముందు కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరమ్ లేదా కాప్లాన్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత విత్తాలి.
 
నీటి యాజమాన్యం
ఎర్ర నేలల్లో ఉష్ణోగ్రతను బట్టి 6 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి భూముల్లో అయితే 15 నుంచి 20 రోజులకొకసారి నీటిని అందించవచ్చు.

శీతకాలంలో తేలిక నేలలకు 4 నుంచి 6 సార్లు, మధ్యస్థ నేలలకు మూడు నుంచి నాలుగుసార్లు, బరువు నెలలకు రెండు నుంచి మూడుసార్లు నీటిని పారించాలి.
 ఎరువుల వాడకం

విత్తనం వేసే మూడు వారాల ముందు ఎకరాకు 3 టన్నుల పశువుల పేడను వేసి దున్నాలి. ఇది భూమిని సారవంతం చేస్తుంది.

భాస్వరం, పోటాష్ ఎరువులను దుక్కిలోనే వేయాలి. నత్రజనిని విత్తనం నాటే సమయంలో, మొగ్గ తొడిగే దశలో, పువ్వు వికసించే దశలో వేసుకోవాలి.

పూత దశలో ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల బొరాక్స్ మందును(లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ చొప్పున కలపాలి) పిచికారి చేయాలి. దీని వల్ల గింజలు ఎక్కువగా తయారవుతాయి.

గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.
 సస్యరక్షణ చర్యలు

పొద్దుతిరుగుడు పంటను రసం పీల్చే పురుగులు, లద్దె పురుగు, గొంగళి పురుగు, పచ్చపురుగు, శనగపచ్చ పురుగు, తలను తొలిచే పురుగు లాంటివి ఆశిస్తాయి. ఆకుమచ్చ తెగులు, తప్పు తెగులు, పువ్వుకుళ్లు, బూ జు తెగులులాంటివి సోకే అవకాశాలుంటాయి. వీటి నివారణకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకొని క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి.

 పక్షులు, అడవి పందుల బెడద
పొద్దుతిరుగుడు పంటకు పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. రామచిలకలు ఎక్కువగా పంటలపై వాలి నష్టం కలిగిస్తాయి. పక్షులను బెదరగొట్టేందుకు మెరుపు రిబ్బన్లను చేను పైభాగంలో(సూర్యరశ్మి వీటిపై పడే ఎత్తులో) కట్టాలి. శబ్ధాలు చేయడం, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా పక్షుల బెడదను తగ్గించవచ్చు.

విత్తనం పట్టాక అడవి పందులు కూడా పంటపై దాడి చేసే అవకాశం ఉంంది. పంట చుట్టూ గుంజలు పాతి ఇనప తీగను చుట్టడం ద్వారా అడవి పందులు రాకుండా చూసుకోవచ్చు.
 
సాగు విస్తీర్ణం పెరుగుతుంది
ఈ ఏడు వర్షాభావ పరిస్థితులుండడంతో పొద్దుతిరుగుడు పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. 15 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు సాగవుతుందని భావిస్తున్నాం. మాక్లూర్ మండల పరిధిలోనే వేయి ఎకరాలకు పైగా భూమిలో ఈ పంట సాగయ్యే అవకా శం ఉంది.

కోతులు అధికంగా తిరిగే గుట్ట ప్రాంతాల్లో ఈ పంట వేయడానికి రైతులు విముఖత చూపుతారే తప్ప మిగతా మండలాల్లో ఈ పంటసాగు చేసే అవకాశాలున్నాయి. సస్య రక్షణ చర్యలు తీసుకుంటే ఎకరాకు 12 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుంది. హరికృష్ణ, ఏవో, మాక్లూర్ మండలం ఫోన్ నంబర్ : 88866 13125

మరిన్ని వార్తలు