సమీప గతంతో సంభాషిద్దాం!

2 Apr, 2016 01:12 IST|Sakshi
సమీప గతంతో సంభాషిద్దాం!

వర్తమాన తరానికి సుదూర గతం ఒక తాత్విక భూమిక. సమీప గతం కరదీపిక. 1858 నుంచి 1956 వరకు ఉన్న చరిత్ర అలాంటి కరదీపిక. ఇవాళ పడిన ముందడుగుకీ, ఎదురైన సంక్షోభాలకీ మూ లాలు ఈ సమీప గతంలోనే ఉన్నాయి. తెలుగు విశ్వ విద్యాలయం, ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సంయుక్తంగా తీసుకువస్తున్న చరిత్ర పుస్తకాలలో ఏడవ  వాల్యూం లోని అధ్యాయాలను పరిశీలిస్తే ఇది అక్షర సత్యమని పిస్తుంది. ఆచార్య బి. కేశవనారాయణ సంపాదక త్వంలో వెలువడిన ఈ సంపుటంలో ప్రతి అంశం మనకు సుపరిచితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం చర్చిస్తున్న చాలా అంశాలకు మూ లాలు ఆ కాలానివే. అప్పటి పరిణామాల ఫలితాలే.

1858లో భారతదేశమే బ్రిటిష్ రాణి పాలన లోకి రావడం చరిత్రలో పెద్ద మలుపు. దీని ప్రభా వం నిజాం రాజ్యంలోను, ఆంధ్ర-రాయలసీమ ప్రాంతంలోను సమానంగానే ఉంది. ఆ తరువాత కాలం అనేక పరిణామాలకు ఆలవాలమైంది. ఇంగ్లి ష్‌తో పరిచయం కలిగి విశ్వవీక్షణం చేసిన తొలితరం మన ప్రాంతాలలో అప్పుడే అవతరించింది. విద్యతో పాటు, సేద్యం, నీటి పారుదల, పరిపాలన వంటి అంశాలు గుణాత్మకమైన మార్పులకు నోచు కున్న కాలం కూడా ఇదే. పరిశ్రమల స్థాపనకు పరిస్థి తులు దారితీసినది ఈ దశలోనే. భారత స్వాతం త్య్రోద్యమ ముఖ్య ఘట్టాలన్నీ ఈ యుగానివే. అవన్నీ తెలుగు ప్రాంతాలను విశేషంగానే తాకాయి.

ఇదొక గొప్ప కదలిక. ఆ పరివర్తనను పరిచ యం చేస్తూ సంపుటి సంపాదకుడు రాసిన విస్తృత మైన అధ్యాయాన్ని మొదట పొందుపరిచారు. 1857కు ముందు ఈస్టిండియా కంపెనీ పాలనకీ, బ్రిటిష్ రాణి పాలనకు ఉన్న వ్యత్యాసాన్నీ, ఇది భార తీయ సమాజంతో పాటు తెలుగువారి మీద కూడా ఎలా ప్రతిబింబించిందో అందులో వివరించారు. తరువాత 63 అధ్యాయాలను రెండు విభాగాలలో ఆవిష్కరించారు. దాదాపు ప్రతి అంశం రెండు తెలుగు ప్రాంతాలలో పరిఢవిల్లిన తీరును, ప్రభా వితం చేసిన విధానాన్నీ వివరించడం విశేషం.

‘రాజకీయం, పరిపాలన, ఆర్థికవ్యవస్థ’ అన్నదే మొదటి విభాగం. ఆంధ్ర-రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్‌పాలనా వ్యవస్థ, ఇటు తెలంగాణలో నిజాం పాలన, సాలార్జంగ్ సంస్కర ణలు వంటి వాటి గురించి లోతుగా వివరించారు. వ్యవ సాయం, నీటి పారుదల, పారిశ్రామికాభివృద్ధి జరిగిన తీరును కూడా అక్షరబద్ధం చేయడం కనిపిస్తుంది. 1905 నుంచి, 1956 వరకు జరిగిన అన్ని కీలక ఉద్యమాలు, రాజ కీయ పరిణామాలను వేర్వేరు అధ్యాయాలలో వివ రించారు. తెలంగాణ ప్రాం తంలో ఎంఐఎం పుట్టుక, తెలంగాణ సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమాల గురించి కూడా చర్చించారు. ఇవే కాకుండా ఆంధ్రప్రాంతంలోని విశాఖ మన్యంలో అల్లూరి శ్రీరామరాజు సాగించిన పోరు, తెలంగాణలో గోండుల పోరు, ఇతర గిరిజన రైతాంగ పోరాటాలను కూడా సమగ్రంగా వివరిం చారు. సబాల్ట్రన్ అధ్యయనానికి తగ్గట్టు తెలుగు ప్రాంతాల గిరిజన తెగల చరిత్రను కూడా కూలం కషంగా చర్చించారు. ఇందుకోసం ఐదారు అధ్యా యాలు కేటాయించడం విశేషం. వీటితోపాటు ఉద్యమాలలో మహిళల పాత్ర, బ్రాహ్మ ణేతర ఉద్యమాలు కూడా అధ్యాయా లుగా చేరాయి.

రెండో విభాగం (భాషా సాహిత్యాలు)లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల పత్రికల చరిత్ర, ఉర్దూ పత్రికారంగం, గ్రంథాలయోద్యమం, జాతీయ సాహి త్యం, భావకవిత్వం, అభ్యుదయ సాహి త్యం, సంఘ సంస్కరణకు సాహిత్యం, దళిత సాహిత్యం వంటి అంశాలను వివ రించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతి పేరుతో వెలువడుతున్న ఈ పుస్తకాలకు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ జనరల్ ఎడిటర్. ఒక ప్రాంతానికి సంబంధించిన సమగ్ర చారిత్రక దృశ్యం ఒకేచోట దర్శించే అవకాశం కల్పించిన సంపాదక మండలిని తెలుగువారంతా అభినందించాలి.

ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతి ఏడవ సంపుటం - ‘ఆధునిక ఆంధ్ర, హైదరాబాద్ (క్రీ.శ.1858-1956)’ (తెలుగు,ఇంగ్లిష్) నేడు హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్న సందర్భంగా. వేదిక: తెలుగు విశ్వవిద్యాలయం.

- కల్హణ

 

మరిన్ని వార్తలు