ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ పత్రాలు

27 Jan, 2018 12:25 IST|Sakshi

కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంటే సులువు

ఈసీ, సీసీ, రిజిస్ట్రేషన్లు పొందవచ్చు

బద్వేలు: ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దస్తావేజు నకల్లు, చరిత్ర తెలిపే ఎన్‌ కంబరెన్స్‌ సర్టిఫికెట్లు (ఈసీ) కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కొంతమేర అవగాహన, కంప్యూటరు పరిజ్ఞానం ఉంటే సులువుగా వీటిని పొందవచ్చు. పైసా ఖర్చు లేకుండా ఇంటి నుంచే ఈసీలు, సీసీలు పొందే అవకాశాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈసీకి 30 ఏళ్ల లోపు అయితే రూ.220, 30 సంవత్సరాలు పైబడితే రూ.520, దస్తావేజు నకళ్ల కోసం రూ.220 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వీటిని పొందే అవకాశం కల్పించారు.

పొందడం ఇలా...: ఆన్‌లైన్లో ఉచితంగా ఈసీలు, సీసీలు తీసుకోవావడానికి కంప్యూటర్, ఇంటర్న్‌ట్‌ సౌకర్యం ఉంటే చాలు. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌.ఏపీ.జీఓవీ.ఇన్‌ అని టైపు చేయాలి. అప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికార వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది.
వెబ్‌సైట్‌ కిందిభాగంలో కుడివైపున ‘న్యూ ఇంటెంటివిస్‌’ కింద ఆన్‌లైన్‌ ఈసీ, ఆన్‌లైన సీసీ, డాక్యుమెంట్‌ ప్రిపరేషన్‌ అనే అప్షన్లు కనిపిస్తాయి. వీటిపై క్లిక్‌ చేస్తే పబ్లిక్‌ ఆన్‌లైన్‌ సర్వీసు అని వస్తుంది.
దీనిపై క్లిక్‌ చేస్తే యూజర్‌ ఐడీ, పాస్వర్డు ఆప్షన్లు వస్తాయి. అందులో నాట్‌ ఏ మెంబరు? పై క్లిక్‌ చేస్తే సిటిజన్‌ రిజిస్ట్రేషన్‌ అని ఓపెన్‌ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి పేరు, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డు, సెల్‌ నెంబరు, ఆధార్‌ నెంబరు, ఈ–మెయిల్, అడ్రస్‌ వంటి వివరాలు టూపు చేసి సబ్మిట్‌ చేయాలి. అనంతరం సెల్‌ఫోన్‌కు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డును నమోదు చేసి యూజర్‌ ఐడీ సహాయంతో లాగిన్‌ అవ్వాలి,
అనంతరం ‘పబ్లిక్‌ ఆన్‌లైన్‌ సర్వీసుకు వెళ్లి యూజర్‌ ఐడీ, పాస్వర్డుతో లాగిన్‌కాగానే పబ్లిక్‌ ఆన్‌లైను పేరుతో డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన ఎన్‌కంబరెన్స్‌ (ఈసీ), సర్టిఫైడ్‌ కాపీ (దస్తావేజులు, నకళ్లు), డాక్యుమెంట్‌ ప్రిపరేషన్స్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మనకు కావాల్సిన సర్వీసుపై క్లిక్‌ చేసి పూర్తి వివరాలను నింపి సబ్మిట్‌ చేయాలి.
ఉదాహరణకు సర్టిఫైడ్‌ కాపీ (సీసీ)లోకి వెళ్లాలంటే జిల్లా, ప్రాంతం, డాక్యుమెంట్‌ నెంబరు, సంవత్సరం వివరాలను ఎంటర్‌ చేస్తే అప్పుడు, డీడ్‌ పర్టిక్యూలర్‌ ఆఫ్‌ డాక్యుమెంట్‌ అని వస్తుంది.
దీనిపై క్లిక్‌ చేస్తే సెల్‌కు వన్‌టైమ్‌ పాస్‌వర్డు వస్తుంది. దీన్ని ఎంటర్‌ చేస్తే సర్టిఫైడ్‌ కాపీ రిసీవ్డ్‌ అని ఓపెన్‌ అవుతుంది. అనంతరం కావాలంటే దాన్ని ప్రింట్‌ చేసుకోవచ్చు. లేదంటే క్లిక్‌ ఆప్షన్‌ నుంచి ఈసీలు, నకళ్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. .
1983 నుంచి ఆన్‌లైన్‌లో ఉన్న ఈసీలు వస్తాయి. అంతకుముందువి కావాలంటే రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి సొమ్ము చెల్లించి పొందవచ్చు.
సర్టిఫైడ్‌ కాపీ నకళ్లు 1999 నుంచి ఆన్‌లైన్‌లో ఉన్నాయి. అంతకుముందువి కావాలంటే రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి నగదు చెల్లించి పొందాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానాన్ని ముందుగా వ్యవసాయ భూముల క్రయ దస్తావేజులు (సేల్‌) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ సైట్‌ ఎర్రర్‌ చూపిస్తోంది. త్వరలో  సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ప్రీ రిజిస్ట్రేషన్‌ దస్తావేజు ప్రిపరేషన్‌కు ఆధార్‌ వివరాలు తప్పనిసరిగా అందజేయాలి.

>
మరిన్ని వార్తలు