అనకాపల్లి రూరల్ : నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం(పీఎంఈజీపీ)ను అమలుచేస్తోందని, నిరుద్యోగులకు ఈ పథకం ఒక వరమని ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.పద్మ అన్నారు. మంగళవారం అనకాపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖాదీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమల ద్వారా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిన్న పరిశ్రమల ఏర్పాటు ద్వారా మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. బ్యాంకులు పీఎంఈజీపీ ద్వారా లబ్ధిదారులకు రుణాలిస్తాయని, వీటిలో 35 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, అనకాపల్లి లీడ్బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, ఖాదీ బోర్డు ఇన్స్పెక్టర్ సురేష్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కిషోర్, కెనరా బ్యాంకు మేనేజర్ విజయ్కుమార్, డీఐసీ ఏడీ జోగినాథం తదితరులు పాల్గొన్నారు.