ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ అధికారులు గురువారం నుంచి నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉక్కు అధికారుల పెండింగ్ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో వారు నిరసన బాట పట్టారు. ఉక్కు అధికారుల పదోన్నతులను సత్వరమే విడుదల చేయాలని, 2021–22లో లాభాలు వచ్చినందున అధికారులకు ఇవ్వాల్సిన పీఆర్పీ వెంటనే ఇవ్వాలని, 2017 నుంచి అమలు చేయాల్సిన వేతన సవరణ వెంటనే చేయాలని, వేతన ఒప్పందంలో భాగంగా పెన్షన్ బకాయిలు వెంటనే ట్రస్ట్ ఖాతాల్లో జమ చేయాలన్న డిమాండ్లపై ఈ కార్యక్రమం చేపట్టారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అధికారులంతా బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారని ఉక్కు అధికారుల సంఘం (సీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాటం చంద్రరావు, కె.వి.డి. ప్రసాద్ తెలిపారు.