ఏపీలో 40 శాతం పెరిగినఉపాధి అవకాశాలు 

15 Dec, 2023 05:34 IST|Sakshi

టాలీ సొల్యూషన్‌ సౌత్‌ ఇండియన్‌ హెడ్‌ భువన్‌ రంజన్‌ 

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఏపీలో 2019లో 4.05 లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటే 2023 నాటికి 5.61 లక్షలకు చేరాయని తద్వారా 40శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయని టాలీ సొల్యూషన్‌ సౌత్‌ ఇండియన్‌ హెడ్‌ భువన్‌ రంజన్‌ చెప్పారు. గురువారం టాలీ ప్రైమ్‌ 4.0 సాఫ్ట్‌వేర్‌ను విశాఖలోని ఓ హోటల్‌లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లలో ఏపీలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దక్షిణ భారత్‌లో వ్యాపార విస్తరణకు ఏపీ అనుకూలంగా ఉందని, అందుకే విశాఖలో తమ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించామని తెలిపారు.

వచ్చే రెండేళ్లలో వంద ఎంఎస్‌ఎంఈ వ్యాపార క్లస్టర్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని, ఇది తమ వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో టాలీ సాఫ్ట్‌వేర్‌ను 50 వేల మందికి పైగా ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్య 4 లక్షలకు చేరుకునే అవకాశం తమ సంస్థకు లభిస్తుందన్నారు. ఈ టాలీ ప్రైమ్‌ 4.0లో ఆకర్షణీయమైన డ్యాష్‌బోర్డు, వాట్సప్‌ను అనుసంధానం, ఎంఎస్‌ ఎక్స్‌ఎల్‌ ఫైల్‌ను నేరుగా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేసే ఫీచర్‌ ఉంచినట్లు వివరించారు. టాలీపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు టాలీ ఎడ్యుకేషన్‌ 
సెంటర్లను ప్రతీ నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు.  

>
మరిన్ని వార్తలు