ఆయుర్వేదం విశిష్టమైన వైద్య విధానం: అజేయ కల్లం 

22 Dec, 2021 05:13 IST|Sakshi
ఆయుర్వేద మెగా హెల్త్‌ క్యాంప్‌ను ప్రారంభిస్తున్న అజేయకల్లం

సచివాలయంలో ఆయుర్వేద మెగా హెల్త్‌ క్యాంప్‌ ప్రారంభం  

సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యం అనేది వేదాలు, పంచ భూతాల ఆధారంగా ప్రకృతి పరంగా అందించబడిన విశిష్టమైన వైద్య విధానమని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయం మూడో బ్లాక్‌లో ఏపీ రాష్ట్ర ఆయుష్‌ విభాగం, సచివాలయ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆయుర్వేద మెగా ఆరోగ్య శిబిరాన్ని మంగళవారం ఆయన  ప్రారంభించారు.

ఆయుష్‌ కమిషనర్‌ కల్నల్‌ రాములు మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిబిరం ద్వారా వివిధ సాధారణ వ్యాధులకు నిపుణులైన వైద్యులచే ఉచితంగా పలు సలహాలు సూచనలతోపాటు అవసరమైన మందులను ఉచితంగా పొందవచ్చన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో 10 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు, ఐదుగురు హోమియో వైద్య నిపుణులు, ఐదుగురు యోగా గురువులతో పాటు మొత్తం 40 మంది వైద్య బృందం పాల్గొంటున్నట్లు చెప్పారు. అంతకు ముందు సీఎం జన్మదినోత్సవం సందర్భంగా అజేయ కల్లం కేక్‌ కట్‌ చేసి ‘ఆయుష్‌ ద్వారా ఆరోగ్యం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.   

మరిన్ని వార్తలు