AP Govt: వీఆర్‌వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

30 Sep, 2022 07:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రేడ్‌–1, 2 గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వో)కు ప్రభుత్వం భరోసానిచ్చింది. సర్వీస్‌లో ఉన్న గ్రేడ్‌–1, 2 వీఆర్‌వో మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ ఏపీ వీఆర్‌వో సర్వీస్‌ నిబంధనలు–2008 లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు.

దీంతో గ్రేడ్‌–1, 2 వీఆర్‌వో కుటుంబంలో డిగ్రీ విద్యార్హత కలిగిన భాగస్వామి/పిల్లలకు కారుణ్య నియామకం కింద జూనియర్‌ అసిస్టెంట్, ఈ క్యాడర్‌కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారు. కారుణ్య నియామకాలపై వీఆర్‌వోలు ఏళ్ల తరబడి  ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే గత టీడీపీ ప్రభుత్వం వీఆర్‌వోల డిమాండ్‌ను పట్టించుకోలేదు. సీఎం జగన్‌ సర్కార్‌.. వీరి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని వీఆర్‌వోల సుదీర్ఘ కాల డిమాండ్‌ను నెరవేర్చింది. దీనిపై ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్‌వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.  

చదవండి: (ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల)

మరిన్ని వార్తలు