సమయం మించిపోలేదు

6 Oct, 2021 05:39 IST|Sakshi

పాలమూరు–రంగారెడ్డిపై ఎన్జీటీ ఎదుట ఏపీ వాదన 

సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిలిపివేయాలని కోరుతూ సమయం మించిపోయిన తర్వాత పిటిషన్‌ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం నిలిపివేయాలంటూ ఏపీకి చెందిన డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు ఎన్జీటీలో దాఖలు చే సిన పిటిషన్‌ను జస్టిస్‌ రామకృష్ణన్, విషయనిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.

ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయిన ఏపీ ప్రభుత్వం తరఫు అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. నిరంతరం కొనసాగింపు పనులు చేపడుతున్న ప్రాజెక్టు కావడంతో సమయం మించిన తర్వాత పిటిషన్‌ దాఖలు చేశారనడం సరికాదని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొని రెండో దశలో తెలంగాణ ప్రభుత్వం బహిరంగ విచారణకు నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. కృష్ణాబోర్డు నివేదికలో సాగునీటి ప్రాజెక్టు అని పేర్కొందన్నారు. కృష్ణాబోర్డు నివేదికలో ఏపీ అభ్యంతరాలు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. 

మరిన్ని వార్తలు