సామాజిక రంగ వ్యయంలో ఏపీనే టాప్‌ 

6 Nov, 2023 04:12 IST|Sakshi

బడ్జెట్‌ కేటాయింపుల్లో 55.71 శాతం వ్యయం 

విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి రాష్ట్రం అత్యధిక ఖర్చు 

ఈ ఆర్థిక ఏడాది తొలి ఆరునెలల గణాంకాలను వెల్లడించిన కాగ్‌ 

42.83 శాతం వ్యయంతో గుజరాత్‌ 2వ స్థానంలో.. 

ఆస్తుల కల్పన వ్యయంలో ఏపీది రెండో స్థానం.. 

కేటాయింపుల్లో 53.37 శాతం వ్యయం 

సాక్షి, అమరావతి:  సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత గుజరాత్‌ రెండో స్థానంలో ఉందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ గణాంకాలు (కాగ్‌) పేర్కొన్నాయి. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలైన ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్‌ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమం పథకాలపై ఇతర రాష్ట్రాలు కన్నా అత్యధికంగా వ్యయం చేసినట్లు కాగ్‌ పేర్కొంది. బడ్జెట్‌ కేటాయింపులు జరిగిన తొలి ఆరు నెలల్లోనే ఈ రంగంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 55.71 శాతం వ్యయం చేసినట్లు స్పష్టంచేసింది. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనగా పేర్కొంటారు. ఇక కాగ్‌తో పాటు ఆర్‌బీఐ కూడా సామాజిక రంగ వ్యయాన్ని కొలమానంగా విశ్లేషిస్తాయి. ఈ రంగంపై మరే ఇతర రాష్ట్రం ఇంత పెద్దఎత్తున వ్యయం చేయలేదు.

ఆంధ్రప్రదేశ్‌ తరువాత సామాజిక రంగ కేటాయింపుల్లో గుజరాత్‌ 42.83 శాతంతో రెండో స్థానంలో ఉందని కాగ్‌ తెలిపింది. మరోవైపు.. ఆస్తుల కల్పనకు చేసిన బడ్జెట్‌ కేటాయింపుల్లో.. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి ఆరు నెలల్లో 53.37 శాతం నిధులు వ్యయం చేయగా..  తెలంగాణ తన బడ్జెట్‌ కేటాయింపుల్లో 60.86 శాతం ఖర్చుపెట్టి మొదటి స్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు