మల్లు స్వరాజ్యం కన్నుమూత.. సీఎం జగన్‌ సంతాపం

20 Mar, 2022 08:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మల్లు కుటుంబ సభ్యులకు ఆయన ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధురాలుగానే కాక సామాజిక, రాజకీయ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారిణి మల్లు స్వరాజ్యం అని జగన్‌ గుర్తు చేసుకున్నారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణ, విలువలతో ఆమె జీవితకాలం మొత్తం జీవించారని కొనియాడారు.

చదవండి: అరుణ కిరణం అస్తమించింది

ఎర్ర మందారం నేల రాలింది. అస్థిత్వం కోసం.. వెట్టి, బానిసత్వం విముక్తి కోసం బరిసెలు ఎత్తి, బాకుల్‌ అందుకొని, బందూకుల్‌ పట్టిన ధీర నింగికెగిశారు. జీవితాంతం సుత్తికొడవలి, చుక్క గుర్తుతోనే సాగిన పోరు చుక్క.. తారల్లో కలిశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధు రాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు.

కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న ఆమెకు ఈనెల 1వ తేదీన ఊపిరితిత్తుల్లోనూ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. 2వ తేదీ మధ్యాహ్నానికి నిమోనియాతో పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో ప్రత్యేక గదికి తరలించి వైద్య సేవలందించారు. అంతా బాగుందనుకున్నా శుక్రవారం మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అంది స్తుండగానే శరీరంలోని అన్ని అవయవాలూ ఫెయిల్‌ కావడంతో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు.  

మరిన్ని వార్తలు