AP Cabinet Minister Jogi Ramesh: ముక్కు సూటితత్వం.. నిలదీసే లక్షణం..

11 Apr, 2022 08:00 IST|Sakshi

ఎన్టీఆర్‌ జిల్లా: ముక్కు సూటితత్వం, ప్రశ్నించే గళం, నిలదీసే లక్షణం.. ఇవీ నాయకుడిగా జోగి రమేష్‌ను నిలబెట్టాయి. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్‌ బీసీల అభివృద్ధి కోసం జరిగిన ఉద్యమాల్లో ముందు నిలిచారు. కృష్ణా జిల్లా ( ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా) ఇబ్రహీంపట్నంలో 1970లో జోగి మోహనరావు, పుష్పవతి దంపతులకు పుట్టిన జోగి రమేష్‌ బీఎస్సీ చదువుకున్నారు. జోగి రమేష్‌కు భార్య - శకుంతల దేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు జోగి రమేష్‌. కృష్ణాజిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌గా వివిధ పదవుల్లో పని చేశాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కాగిత వెంకట్రావు పై 1192 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 

2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగి రమేష్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారు. 2019లో పెడన నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. టీడీపీ అభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్ పై 7839 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో జోగి రమేష్‌ను పలు మార్లు లక్ష్యంగా చేసుకుంది తెలుగుదేశం. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపడానికి వెళ్లినప్పుడు జోగి రమేష్‌పై భౌతిక దాడికి ప్రయత్నించింది. ఆ ఘటనలో ఆయన కారును ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు.

మరిన్ని వార్తలు