డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులకు స్వస్తి

26 Sep, 2020 03:25 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ విధానాన్ని గత ప్రభుత్వం 2016లో అమల్లోకి తీసుకురాగా.. ఒక తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు తగ్గిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులు సకాలంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందలేకపోతున్నారు.

ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విధానాన్ని రద్దు చేశారు. ఇకపై ఏపీపీఎస్‌సీ నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులు ఉండవు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే లక్షకు పైగా ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లోని ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్ల ప్రయోజనం కలగనుంది. కాగా, ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఫెడరేషన్‌ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు