ప్రజా వైద్యం పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

6 Nov, 2023 15:39 IST|Sakshi

జగనన్న ఆరోగ్య సురక్షపై కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష

ముగింపు దశకు వైద్య శిబిరాల నిర్వహణ

ఇకపైనే అసలు పని అంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యలు

పేషెంట్ల ప్రయాణ ఖర్చులకు రూ.500

నిర్ణీత సమాయానికి చికిత్సతో పాటు మందులు

ఆరోగ్యశ్రీలో కవర్‌ కాని కేసులపై ప్రత్యేక దృష్టి

చికిత్స తర్వాత కూడా పర్యవేక్షణ ఉంటుందని స్పష్టీకరణ

సాక్షి, గుంటూరు:  జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావని, పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల వద్ద ప్రస్తావించారు. సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారాయన. 

జగనన్న ఆరోగ్య సురక్షలో ఇప్పటిదాకా పురోగతిని వివరిస్తూనే.. రాబోయే రోజుల్లో ఏం చేయాలన్నదానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారాయన.  ఈ సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనది. వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చింది. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం, వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తైంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూతనివ్వడం చాలా ముఖ్యం. ఇవి సాధారణమైన సాధారణ వైద్య శిబిరాలు కావు. శిబిరాల నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అనేదే అత్యంత ముఖ్యమైంది’’ అని ఆయన అన్నారు. 

ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు పూర్తిగా నయం అయ్యేంతవరకూ చేదోడుగా నిలవడమే  జగనన్న ఆరోగ్య సురక్ష ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారాయన. ‘‘ఈ కార్యక్రమంలో మొదటి అడుగుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించాం. ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోంది. అర్బన్‌ ఏరియాల్లో 91 శాతం, రూరల్‌ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్‌ పూర్తయ్యింది. 
1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్‌ పూర్తిచేశారు. 6.4 కోట్ల ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మనం జనగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉన్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక యాప్‌ను మనం వాడుతున్నాం. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటున్నాం. వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నాం. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలనే దానిపై మన దగ్గర డేటా ఉంది’’ అన్నారాయన. 

.. ‘జగనన్న సురక్ష క్యాంపుల్లో నవంబర్‌ 5  కల్లా 85వేల మంది పేషెంట్లను తదుపరి చికిత్సలకోసం నెట్‌వర్క్‌ ఆస్పత్రి/ టీచింగ్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేశారు. వీరికి చేయూత నివ్వడం ఒక కార్యక్రమం. మొబైల్‌ యాప్‌ ద్వారా ట్రాక్‌చేసి, వారిని ఆయా ఆస్పత్రులకు మ్యాప్‌ చేయాలి. ఆ తర్వాత విలేజ్‌ క్లినిక్‌కు, ఫ్యామిలీడాక్టర్‌కు, గ్రామ సచివాలయంలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో అనుసంధానం చేయించాలి. వారి ద్వారా వీరికి నయం అయ్యేంతవరకూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. 13,850 కేసులను ఇప్పటివరకూ చేయూత నిచ్చి వారిని తదుపరి చికిత్సలకోసం ఆస్పత్రులకు పంపించడం జరిగింది. మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. వారికి కావాల్సిన మందులు ఇచ్చి.. వారిని నయం అయ్యేంత వరకూ కూడా తగిన విధంగా చేయూత నివ్వాలి’ అని అధికారుల్ని సీఎం జగన్‌ ఆదేశించారు. 

.. ‘‘మిగిలిన ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి గుర్తించిన మొత్తం రిఫరెల్‌ కేసులన్నింటికీ కూడా తదుపరి చికిత్సలు అందించే కార్యక్రమం డిసెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తిచేయాలి. వీరు చికిత్సలు చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చాక వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారికి కావాల్సిన మందులు అందించడంతోపాటు, వారు వేసుకునేలా తగిన విధంగా చేయూత నివ్వాలి. రిఫరల్‌ ఆస్పత్రులకు వెళ్లేందుకు ఈ పేషెంట్లకు రూ.500లు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి. ఒకవేళ ఆరోగ్య శ్రీ ప్రొసీజర్‌లో కవర్‌ కాని కేసులు అక్కడక్కడా ఉండొచ్చు.  ఫ్యామిలీ డాక్టర్‌ రిఫరెన్స్‌ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి. అలాంటి రోగాలకు కూడా ఆరోగ్య శ్రీకింద ఉచితంగా చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు సీఎం జగన్‌. 

జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించాలన్న సీఎం జగన్‌.. ప్రతి నెలా మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే.. ఆరోగ్య శ్రీ కింద నమోదుకాని రోగాలు ఏమైనా కనిపించినా.. ప్రత్యేక కేసుల కింద పరిగణించి వారికి ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు అందచేయాలన్నరు. అలాంటి పేషెంట్ల చికిత్సకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అధికారులతో అన్నారాయన.  

ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు చేయించుకున్న పేషెంట్లపై దృష్టిపెట్టడం అనేది మరొక విషయం. చికిత్సలు చేయించుకున్న తర్వాత వీరికి అందిన వైద్యంపై పూర్తి వివరాలు కనుక్కోవాలి. ఎలాంటి లంచాలకు తావులేకుండా ఉచితంగా వైద్యం అందిందా? లేదా? అనేది తెలుసుకోవాలి. వాళ్లు మందులు తీసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలి. ఆరోగ్య శ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నాం. అయితే వాళ్లు క్రమం తప్పకుండా తిరిగి వీళ్లు ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. పేషెంట్లకు తెలియక, సరైన అవగాహన లేక తదితర కారణాల వల్ల చికిత్సలు చేయించుకున్న రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకోని సందర్బాలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదు. నిర్ణీత సమయానికి పేషెంట్లు వెళ్లి.. మందులు తీసుకునేలా చూడాలి. ఈమేరకు యాప్‌లో తగిన విధంగా ఫీచర్లు తీసుకొచ్చాం. అలాగే.. ఆ బాధ్యత విలేజ్‌ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు కూడా ఉంటుంది అని సీఎం జగన్‌ అన్నారు. 

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల కింద గుర్తించిన పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందించడం అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పటిదాకా 8.7 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. వీరికి వెంటనే కంటి అద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే 73 వేలమందికిపైగా కంటి సర్జరీలు చేయాలని వైద్యులు చెప్పారు. ఆ సర్జరీలు కూడా వెంటనే పూర్తి కావాలి. డిసెంబర్‌ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీకూడా పూర్తికావాలి అని సీఎం జగన్‌, అధికారులకు ఆదేశించారు. 

ఇంకా ఏమన్నారంటే.. ‘‘హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌ ఉన్నట్టుగా గుర్తించిన వారికి తదుపరి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. అందులోకూడా నిర్ధారణ అయిన తర్వాత వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ప్రివెంటివ్‌ కేర్‌లో ఇది కీలక అంశం. అలాగే 9,969 మందికి లెప్రసీ అనుమానాస్పద కేసులు ఉన్నాయి. వీరికి వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. అలాగే 442 మందికి టీబీ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. సుమారు 1, 239 మంది చిన్నారులు 4-D సమస్యలతో బాధపడుతున్నట్టుగా తేలింది:
వీరికి అవసరమైన చికిత్సలు అందించడంపై దృష్టిపెట్టాలి. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ లాంటి చికిత్సలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందించడం వల్ల ఆ పిల్లలు ఈ సమస్యలనుంచి బయటపడతారు. 

ఇప్పటికే తీవ్రరోగాలతో బాధపడుతున్న వారికి తగిన రీతిలో చేయూత నందించాలి. ఈ మందులు ఖరీదైనవి కాబట్టి, వాళ్లు మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి కూడా మందులు అందించాలి. మందులు ఎంత ఖరీదైనా సరే, పేషెంట్లకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. గ్రామ వార్డు సచివాలయం, విలేజ్‌ క్లినిక్‌ ఆధారంగా మ్యాపింగ్‌ చేసి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌తో అనుసంధానం చేయాలి.

రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నాయి. పదిహేడు మెడికల్‌ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ప్రతి జిల్లాలోకూడా అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఉన్న మెడికల్ కాలేజీలను కూడా పునరుద్ధరిస్తున్నాం. రిక్రూట్‌మెంట్‌ పాలసీమీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఎక్కడైనా స్పెషలిస్టులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలి. ఇప్పటికే 53 వేలమందిని ఆరోగ్య రంగంలో ఖాళీలను మనం భర్తీచేశాం. ఎక్కడ ఖాళీలు ఉన్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, మెడికల్‌ రిక్రూట్‌ బోర్డును సృష్టించడం జరిగింది. ప్రివెంటివ్‌ కేర్‌లో జగనన్న సురక్ష, విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీడాక్టర్‌ కాన్సెప్ట్‌లు అత్యంత కీలకం కానున్నాయి. 

పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలి. ఈ సమస్యలతో బాధపడుతున్నవారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందుతుందా? వారికి మందులు అందుతున్నాయా? అనే విషయాల్ని విలేజ్‌ క్లినిక్‌ ద్వారా పరిశీలన చేయించాలి. లక్ష్యాలను సాధించడానికి దేశంలో ఏ రాష్ట్రాంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉంది. విలేజ్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెస్ట్‌, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థ ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థలు లేవు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తాం. 

జనవరి 1 నుంచి క్రమంత తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణ ఉండాలి. ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలి. నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలి. ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుంది. దీనివల్ల సంతృప్త స్థాయిలో సేవలు అందుతాయి. ఆరోగ్య పరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యత. 

అలాగే ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకూ ఈ ప్రచారం నిర్వహించాలి:
మంచి ఫీచర్లతో ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. డిసెంబర్‌ 1 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ఆరోగ్య శ్రీని ఎలా పొందాలన్నదానిపై దానిపై ప్రతి ఒక్కరికీ తెలియాలి. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఆరోగ్య శ్రీ యాప్‌ ఉండాలి. ఆరోగ్య శ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్‌.. ఆస్పత్రికి మార్గం చూపిస్తుంది. లేకపోతే విలేజ్‌ క్లినిక్‌ను అడిగినా, అలాగే 104ను అడిగినా తగిన రీతిలో గైడ్‌ చేస్తారు. ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుక్‌లెట్స్‌కూడా ప్రతి కుటుంబానికీ అందిస్తారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం.. 2,295 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. అయినా వైద్యంకోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లోనుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాల్సిన అవసరం ఏముంది?. అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మన అందరి బాధ్యత. ఆ దిశగా అడుగులు వేసే లక్ష్యంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చాం అని సీఎం జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు