సాక్షి, అమరావతి : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన రాజ్యాంగం అమలు ప్రారంభమై 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపటికి 72వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సమయంలో రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాటా ఎంత విలువైనదో, ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలన్నారు. చదవండి: వైఎస్సార్ సీపీ ఎంపీలతో సీఎం జగన్ భేటీ
సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రమైన మన దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు, భావపరమైన, వ్యక్తీకరణ పరమైన, మతపరమైన స్వాతంత్య్రాలను మన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ప్రసాదించిందన్నారు. పౌరులందరికీ సమాన హోదాను, సమాన అవకాశాలను పెంపొందించేలా మన రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిందని కొనియాడారు. సోదర భావంతో కలిసి ఉండాలని నిర్దేశించిందని, ఈ అన్ని సూత్రాలకు ప్రతిరూపంగానే ఆంధ్రప్రదేశ్లో గత 20 నెలలుగా పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.