అక్కా చెల్లెమ్మలకు అండగా.. పథకాలు మెండుగా..

24 Nov, 2022 22:55 IST|Sakshi

ఆర్థిక లావాదేవీలలో పెరిగిన మహిళల భాగస్వామ్యం  

మూడేళ్ల పాలనలో డీఆర్‌డీఏ ద్వారా జిల్లాలో సున్నా వడ్డీ పథకం కింద 

మూడు విడతలలో రూ. 166.402 కోట్లు ఖాతాలలో జమ  

2022–23 ఆర్థిక సంవత్సరానికి డీఆర్‌డీఏ బ్యాంకు లికేంజీ ద్వారా 7381 ఎస్‌హెచ్‌జీలకు రూ. 53416 లక్షలు   

రాయచోటి: సంక్షేమమే ఊపిరిగా.. అభివృద్ధి అజెండాగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది. ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అతివలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. డ్వాక్రా అక్కా చెల్లెమ్మల ఇబ్బందులు నాడు పాదయాత్రలో స్వయంగా పరిశీలించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా లబ్ధి పొందిన మహిళలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను వేనోళ్లా కొనియాడుతున్నారు.  

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం: వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద (డీఆర్‌డీఏ) జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 18,450 డ్వాక్రా సంఘాలకు రూ. 44.09 కోట్లు, రెండో విడత 20,730 డ్వాక్రా సంఘాలకు రూ. 59.69 కోట్లు, మూడో విడత 21,641 డ్వాక్రా సంఘాలకు రూ. 62.622 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం కింద మొత్తం మూడు విడతలలో రూ. 166.402 కోట్లు రాష్ట్రప్రభుత్వం జమ చేసింది.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద (మెప్మా) జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 3053 డ్వాక్వా సంఘాలకు రూ. 5.34 కోట్లు, రెండో విడత 3144 డ్వాక్వా సంఘాలకు రూ. 4.97 కోట్లు, మూడో విడత 3442 డ్వాక్వా సంఘాలకు రూ. 5.21 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. సున్నా వడ్డీ పథకం కింద మొత్తం విడతలలో రూ. 15.52 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.  

బ్యాంకు లింకేజీ: బ్యాంకు లింకేజీ ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి (డీఆర్‌డీఏ) ద్వారా జిల్లా వ్యాప్తంగా 17,335 డ్వాక్రా సంఘాలకు రూ. 73.352 లక్షలు లక్ష్యంగా పెట్టుకోగా అందులో 7381 డ్వాక్రా సంఘాలకు రూ. 53,416 లక్షలు రుణం రూపంలో అందజేశారు.  

స్త్రీనిధి: స్త్రీనిధి ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డీఆర్‌డీఏ ద్వారా జిల్లా వ్యాప్తంగా 27,260 డ్వాక్రా సభ్యులకు రూ. 136.3 కోట్లు టార్గెట్‌ పెట్టుకోగా 24341 డ్వాక్రా సంఘాలకు రూ. 91.47 కోట్లు రుణం రూపంలో అందజేశారు.   

మహిళా సాధికారతతోనే సమాజ అభివద్ధి 
మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అన్ని సంక్షేమ పథకాలకు మహిళలనే ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేసి మహిళామణులుగా నిలుపుతున్నారు. స్వయం సహాయక సంఘ మహిళల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దిగువ, మధ్య తరగతి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు బ్యాంకులతోపాటు బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని వ్యాపారం, స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.    
–గిరీషా పీఎస్, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌

ఒక్కో సంఘానికి రూ. 20 లక్షల వరకు రుణాలు  
ప్రస్తుతం బ్యాంకుల నుంచి  స్త్రీనిధి, ఉన్నతి లాంటి అనేక పథకాల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం వలన పెట్టుబడికి నిధుల కొరత ఉండటం లేదు. మహిళల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సంఘానికి రూ. 20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాం. అలాగే మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణ వలన పరపతి సౌకర్యం బాగా పెరిగింది.       
–బి.సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ, అన్నమయ్య జిల్లా  

మహిళల సంక్షేమానికి  పెద్దపీట  
నాపేరు ఎస్‌ శ్రీదేవి.నేను టి సుండుపల్లి మండలం జి.రెడ్డివారిపల్లిలో నివసిస్తున్నాను. లక్ష్మీ వెంకటేశ్వర పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 1,25,000లు శ్రీనిధి ద్వారా రూ. 50,000లు రుణం తీసుకున్నాను. నేను మా ఊరిలోనే కిరాణా దుకాణం, ఫ్యాన్సీ స్టోర్, ఎలక్ట్రికల్, స్లిప్పర్స్‌ షాపు పెట్టుకున్నాను.  వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం నాకు వర్తించింది. సీజన్‌ను బట్టి నెలకూ రూ. 8వేలు నుంచి రూ. 15వేలు ఆదాయం వస్తుంది. మహిళల సంక్షేమానికి, ఆర్థిక పురోగతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేస్తున్నారు. 

చేతల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు 
నాపేరు ఎస్‌ కరీమున్‌.టి సుండుపల్లె మండల కేంద్రంలో నివసిస్తున్నాను. అల్లాహ్‌ పొదుపు సంఘంలో సభ్యురాలిని. కెనరా బ్యాంకులో పొదుపు సంఘం తరపున రూ. 1.30లక్షలు రుణం తీసుకున్నాం. మా సంఘానికి ఆసరా పథకం, సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో నేను, నా భర్త కలిసి ఫ్యాన్సీ స్టోర్‌ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాము. ప్రతి నెల రూ. 15వేలు ఆదాయం వస్తుంది. జగనన్న చేతల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. 

ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు 
నాపేరు పసుపులేటి పద్మావతి. కురబలకోట మండలం పూజారివారిపల్లిలో నివసిస్తున్నా. వెన్నెల పొదుపు సంఘంలో బ్యాంకు నుంచి రూ. 2 లక్షలు తీసుకున్నా. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రూ. 2.30 లక్షలు, సున్నా వడ్డీ పథకం కింద రూ. 27 వేలు డబ్బులు జమ అయ్యాయి.  మిల్లెట్‌ ఫుడ్స్‌ తయారీ  వ్యాపారం చేస్తున్నాను. ఇచ్చిన మాట నెరవేరుస్తున్న సీఎం  మహిళల పాలిట దేవుడు.    

మరిన్ని వార్తలు