మ్యూజియాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

1 Oct, 2020 12:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. మ్యూజియం వద్ద పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం విక్డోరియా మహల్‌లోని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించిన సిఎం వైఎస్ జగన్.. జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. ఆది మానవ చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళ సంపదతో పాటు ఆధునిక హంగులతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఆది మానవుడి నుంచి 19వ శతాబ్ధపు ఆధునిక మాన వుడు వరకు ఉపయోగించిన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు, వంట సామగ్రి తదితరాలను భద్రపరిచారు. (చదవండి: బాపూ మ్యూజియానికి పూర్వ వైభవం)


ఒక్కో గ్యాలరీలో ఒక్కో ప్రత్యేకత.. 
తొలి చారిత్రక యుగ గ్యాలరీలో 10 లక్షల సంవత్సరా ల కిందటి నుంచి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. వీటిలో ఆది మానవులు ఉపయోగించిన రాతి పని ముట్లు, 12 కాళ్ల మట్టి శవపేటిక, మట్టి బొమ్మలు, కుండ పెంకులు, సున్నపు ప్రతిమలు, పూసలు, ఫలకాలు అత్యంత అరుదైనవి. 
బుద్ధ జైన గ్యాలరీలో బౌద్ధ, జైన రాతి, కాంస్య ప్రతిమలను ప్రదర్శనకు పెట్టారు. 
హిందూ శిల్ప కళా గ్యాలరీలో హిందూ దేవతల రాతి, కాంస్య ప్రతిమలు ఉంచారు.   
నాణేలు–శాసనాల గ్యాలరీలో క్రీ.శ 6వ శతాబ్ధం నుంచి ఉపయోగించిన వివిధ రాజ వంశాల సీసపు, రాగి, ఇత్తడి, వెండి, బంగారు నాణేలను ప్రదర్శనకు పెట్టారు. 
టెక్స్‌టైల్‌ గ్యాలరీ క్రీ.శ 18–19వ శతాబ్ధాలకు చెందినది. అసఫ్‌ జాహీల కాలం నాటి సంప్రదాయ వ్రస్తాలను పెట్టారు. 
మధ్య యుగపు గ్యాలరీలో అజంతా, చుగ్‌తాయ్, డెక్కన్, రాజస్థానీ, ఆధునిక చిత్ర లేఖనాలు, అప్పటి రాజ వంశాలకు చెందిన వారు ఉపయోగించిన బిద్రి, పింగాణి పాత్రలుంచారు. 
ఆయుధాలు, కవచాల గ్యాలరీలో బాణాలు, విల్లంబులు, బాకులు, కత్తులు, డాళ్లు, రక్షణ కవచాలు, తుపాకులు, పిస్టల్స్, రివాల్వర్లు, ఫిరంగులను ప్రదర్శనకు పెట్టారు.

 

  

మరిన్ని వార్తలు