నాణ్యమైన విద్యే లక్ష్యం: సీఎం వైఎస్‌ జగన్‌

18 Jun, 2021 04:05 IST|Sakshi
విద్యార్థులకు ఇవ్వనున్న డిక్షనరీని సీఎం వైఎస్‌ జగన్‌కు చూపిస్తున్న మంత్రి సురేశ్‌ తదితరులు

నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్‌ కూడా మూత పడటం లేదు..

ఒక్క టీచర్‌ను కూడా తీసేయడం లేదు

విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపైఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం

చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నాం

రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలి

నూతన విద్యా విధానం వల్ల జరిగే మేలును అందరికీ వివరించాలి

ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు–నేడు కింద భూమి కొనుగోలు

ప్రతిభ కలిగిన అంగన్‌వాడీ టీచర్లకు భవిష్యత్‌లో పదోన్నతి 

నూతన విద్యా విధానంపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో సమాధానం చెప్పాలి. కొత్త విధానం లక్ష్యాలను, ప్రయోజనాలను వివరించాలి.

8 ఏళ్లలోపు పిల్లల మానసిక వికాసం చాలా ముఖ్యం. ఈ పిల్లల్లో నూరు శాతం మెదడు అభివృద్ధి చెందుతుంది. ఆ వయస్సులో వారి నైపుణ్యాలను మెరుగుపర్చాలి. ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి. ఫాండేషన్‌ స్కూళ్ల లక్ష్యమిదే.

ప్రస్తుతం విద్యా కానుకలో ఇస్తున్న దానికంటే వచ్చే ఏడాది అదనంగా స్పోర్ట్స్‌ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. పాఠశాలల్లో ప్రయోగశాలలు, ఇంటర్నెట్‌తో లైబ్రరీలను బలోపేతం చేయాలి. 

సాక్షి, అమరావతి: నాణ్యమైన విద్య, బోధన, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందని.. ఇప్పటి వారికే కాకుండా తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యా శాఖ, అంగన్‌ వాడీల్లో నాడు–నేడు, నూతన విద్యా విధానంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్‌ మూత పడటం లేదని, ఒక్క ఉపాధ్యాయుడ్ని కూడా తీసేయడం లేదని, అంతిమంగా అదే సందేశం వెళ్లాలని స్పష్టం చేశారు. అంగన్‌వాడీల్లో కూడా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని, ఒక్క సెంటర్‌ను కూడా మూసి వేయడం లేదన్నారు. ‘ఇంగ్లిష్‌ మీడియంలో చదువు చెప్పాలని ఆరాట పడుతున్నాం. పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నాం. ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. గొప్ప కార్యక్రమం చేపడుతున్నాం. సానుకూల దృక్పథంతో పని చేయండి. ఇదే విషయాన్ని అందరికీ చెప్పండి’ అని స్పష్టం చేశారు. ఈ   అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రెండు రకాల స్కూళ్లు

  • రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యం. పీపీ (ప్రీ ప్రైమరీ)1, పీపీ2, ప్రిపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒక రకం. వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు స్కూలు ఉంటుంది. 
  • మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి 10వ తరగతి వరకు సమీపంలో ఉన్న హై స్కూల్‌ పరిధిలోకి తీసుకురావాలి. ఈ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలి. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలి.

ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండాలి

  • ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం. నలుగురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదు. పౌండేషన్‌ కోర్సులో ఇది చాలా అవసరం.
  • ఎందుకంటే 8 సంవత్సరాలలోపు పిల్లల మానసిక వికాసం చాలా ముఖ్యం. ఈ వయసులోపు పిల్లల్లో నూరు శాతం మెదడు అభివృద్ధి చెందుతుంది. ఆ వయస్సులో వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చాలి. ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి. 

3 కిలోమీటర్ల లోపు హైస్కూల్‌ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదు. అలాగే ఒకే చోట ఎక్కువ క్లాస్‌ రూంలు పెట్టడం సరికాదు. 

అందరి సందేహాలు తీర్చాలి

  • నూతన విద్యా విధానంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించండి. ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే అధికారులు వారికి తగిన సమయం కేటాయించి వారి సందేహాలు తీర్చండి. ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో వారికి కొత్త విద్యా విధానం లక్ష్యాలను, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి. 
  • భాగస్వాములైన టీచర్లను, ప్రజాప్రతినిధులను అందరినీ పరిగణనలోకి తీసుకుని వారికి వివరాలు తెలియజేసి వారిలో అవగాహన కలిగించండి. వచ్చే సమావేశానికల్లా ఈ నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, అయ్యే ఖర్చుపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. రెండేళ్లలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి.
  • వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సమూల మార్పు తీసుకొస్తున్నాం. ఐదేళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూడు రంగాల్లో మనం చేసిన ప్రగతి కనిపించాలి.

    ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ అవసరం

  • అంగన్‌వాడీలు కూడా నాడు-నేడులో భాగం. దీనికి కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి.  2 సంవత్సరాలలోపు అనుకున్న కాన్సెప్ట్‌ పూర్తి కావాలి. సాచ్యురేషన్‌ పద్ధతిలో అంగన్‌వాడీలుంటాయి. 55 వేల అంగన్‌వాడీల్లో మనం ఎక్కడా తగ్గించడం లేదు. ప్రతిభ కలిగిన అంగన్‌వాడీ టీచర్లకు భవిష్యత్‌లో పదోన్నతి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటాం. 
  • పౌండేషన్‌ స్కూల్‌ కాన్సెప్ట్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందరూ ఇదే ఫాలో అవ్వాలి. 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులు ఒక ఎస్‌జీటీ టీచర్‌ డీల్‌ చేయలేడు. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ అవసరం.
  • జూలై 1 నుంచి రెండో విడత నాడు–నేడు ప్రారంభమవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. స్కూళ్లలో నాడు –నేడు గురించి తెలంగాణ అధికారులు సంప్రదించారని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా వారికి మంచి జరగాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆకాంక్షించారు. 
  • విద్యా కానుకలో భాగంగా ఇవ్వనున్న డిక్షనరీని అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.  
  • ఎన్‌ఈపీ (నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌) ప్రకారం నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన మన లక్ష్యం. ఆ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలి. మనం చేస్తున్న పనులన్నీ కూడా తలెత్తుకుని చేస్తున్నవి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అటు ఉపాధ్యాయులుకు, ఇటు పిల్లలకు నూతన విద్యా విధానంతో మంచి జరుగుతుందని వివరించండి.
  • ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు- నేడు కింద భూమిని కొనుగోలు చేయాలి. ప్రస్తుత విద్యా కానుకలో ఇస్తున్న దానికంటే వచ్చే ఏడాది అదనంగా స్పోర్ట్స్‌ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. ఇందుకోసం ప్రణాళిక వేసుకోవాలి. పాఠశాలల్లో ప్రయోగశాలలు, లైబ్రరీలను బలోపేతం చేసుకోవాలి. పాఠశాల లైబ్రరీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం అందించాలి.
>
మరిన్ని వార్తలు