నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్ కూడా మూత పడటం లేదు..
ఒక్క టీచర్ను కూడా తీసేయడం లేదు
విద్యాశాఖ, అంగన్వాడీల్లో నాడు-నేడుపైఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం
చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నాం
రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలి
నూతన విద్యా విధానం వల్ల జరిగే మేలును అందరికీ వివరించాలి
ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు–నేడు కింద భూమి కొనుగోలు
ప్రతిభ కలిగిన అంగన్వాడీ టీచర్లకు భవిష్యత్లో పదోన్నతి
నూతన విద్యా విధానంపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో సమాధానం చెప్పాలి. కొత్త విధానం లక్ష్యాలను, ప్రయోజనాలను వివరించాలి.
8 ఏళ్లలోపు పిల్లల మానసిక వికాసం చాలా ముఖ్యం. ఈ పిల్లల్లో నూరు శాతం మెదడు అభివృద్ధి చెందుతుంది. ఆ వయస్సులో వారి నైపుణ్యాలను మెరుగుపర్చాలి. ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి. ఫాండేషన్ స్కూళ్ల లక్ష్యమిదే.
ప్రస్తుతం విద్యా కానుకలో ఇస్తున్న దానికంటే వచ్చే ఏడాది అదనంగా స్పోర్ట్స్ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. పాఠశాలల్లో ప్రయోగశాలలు, ఇంటర్నెట్తో లైబ్రరీలను బలోపేతం చేయాలి.
సాక్షి, అమరావతి: నాణ్యమైన విద్య, బోధన, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందని.. ఇప్పటి వారికే కాకుండా తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యా శాఖ, అంగన్ వాడీల్లో నాడు–నేడు, నూతన విద్యా విధానంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్ మూత పడటం లేదని, ఒక్క ఉపాధ్యాయుడ్ని కూడా తీసేయడం లేదని, అంతిమంగా అదే సందేశం వెళ్లాలని స్పష్టం చేశారు. అంగన్వాడీల్లో కూడా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని, ఒక్క సెంటర్ను కూడా మూసి వేయడం లేదన్నారు. ‘ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పాలని ఆరాట పడుతున్నాం. పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నాం. ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. గొప్ప కార్యక్రమం చేపడుతున్నాం. సానుకూల దృక్పథంతో పని చేయండి. ఇదే విషయాన్ని అందరికీ చెప్పండి’ అని స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
రెండు రకాల స్కూళ్లు
ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండాలి
3 కిలోమీటర్ల లోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదు. అలాగే ఒకే చోట ఎక్కువ క్లాస్ రూంలు పెట్టడం సరికాదు.
అందరి సందేహాలు తీర్చాలి
ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ అవసరం