విచారణ అధికారులకు కరోనా పాజిటివ్‌

13 Sep, 2020 18:50 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ఇటీవల చోటుచేసుకున్న అంతర్వేదీ ఘటనలో కరోనా కలకలం రేపుతోంది. రథం దగ్ధమైనందుకు నిరసనగా పలువురు ఆందోళనలో కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేయగా వారిలో కొంతమందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 36 మంది నిందితుల్లో ఇద్దరికి కరోనాగా నిర్ధారణ కాగా.. ముందస్తు జాగ్రత్తగా పోలీసు అధికారులు కూడా పరీక్షలు చేసుకున్నారు. దీనిలో జిల్లా అదనపు ఎస్పీ( పరిపాలన) కరణం కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఆయనతో పాటు ఈ కేసును విచారించిన ఎస్పీ నయీమ్ ఆస్మి, రాజోలు సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఆయన డ్రైవర్, రైటర్, మరో ఐదుగురు ఎస్ఐలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. పలువరు పోలీసు అధికారులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు)

కాగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 6న ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. ఈ కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తరువాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆపోహలను ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. దీనిలో సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీఓ శుక్రవారం వెలువడనుంది.  (అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం)

మరిన్ని వార్తలు