జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 ఎం–2 రాకెట్‌కు కౌంట్‌డౌన్‌ 

22 Oct, 2022 08:16 IST|Sakshi

రేపు అర్ధరాత్రి ప్రయోగం 

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 23న ఆదివారం అర్ధరాత్రి 12 గంటల 7 సెకండ్లకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 ఎం–2 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో 22న శనివారం అర్ధరాత్రి 12 గంటల7 సెకండ్లకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం షార్‌లో ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

మూడు దశల రాకెట్‌ను అనుసంధానం చేసి.. ప్రయోగవేదిక అమర్చాక.. అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. తర్వాత ప్రయోగ పనులను ల్యాబ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్‌ రాజరాజన్‌ ఆధ్వర్యంలో ల్యాబ్‌ మీటింగ్‌ నిర్వహించారు. రాకెట్‌కు మరోమారు తుది విడత తనిఖీలు నిర్వహించి లాంచ్‌ రిహార్సల్స్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఈ ప్రయోగం ద్వారా యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన 5,200 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఇప్పటిదాకా పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లను మాత్రమే వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించేవారు. ఇప్పుడు తొలిసారిగా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వినియోగిస్తుండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు