Fact Check: టీటీడీ వసతి గదులకు సంబంధించిన వాస్తవాలు ఇవి

12 Jan, 2023 17:01 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచారన్న విమర్శలు సరికాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా దీనిపై చర్చ చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే మాట్లాడటం బాధాకరమన్నారు. భక్తులకు నిజాలు తెలియాలి అనే ఉద్ధేశ్యంతోనే వివరాలు తెలియజేస్తున్నామన్నారు.

తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మొత్తం 7500 గదులు ఉన్నాయి. అందులో 5000 గదులు 50 రూపాయలు, 100 రూపాయలు టారిఫ్ తో భక్తులకు టీటీడీ వారు అందిస్తున్నారు. అంటే 75% సామాన్య భక్తులకు అందుబాటులోనే టీటీడీ వారు సౌకర్యవంతమైన వసతులను అందిస్తున్నారు. ఈ 5000 రూములను ప్రస్తుత ప్రభుత్వం మరియు ప్రస్తుత టీటీడీ ట్రస్ట్ బోర్డు 120 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరణ పనులను చేపట్టి, దిగ్విజయంగా పూర్తి చేసి, ఒక రూపాయి కూడా అదనంగా అద్దెను పెంచలేదు.

అదేవిధంగా 1250 గదులు ₹1000 టారిఫ్ తో ఉండేటివి ఎవరైతే ఆన్లైన్ ద్వారా 300 రూపాయల ఎస్.ఈ.డి దర్శనాలు బుక్ చేసుకుంటారో వారికి అడ్వాన్స్ ఆన్లైన్ అకామిడేషన్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకునేందుకు గాను ఈ 1250 గదులను అందుబాటులో ఉంటాయి.

మిగతా 1250 గదులు తిరుమలలోని పద్మావతి ఏరియాలో వివిఐపిల కేటాయింపుల కోసం ఉంచబడినవి. వివిఐపిలకు కేటాయించబడిన ఈ 1250 గదులలో 170 గదులకు మాత్రమే ఏర్ కండిషన్ (ఏసి) లాంటి వసతులు లేకపోవడం,  వాటిని ఆధునికరించడంలో భాగంగా ఏసీలు, గీజర్లు, వుడెన్ కబోర్డ్స్, కాట్స్ లాంటివి సుమారు 8 లక్షలు ఒక్కొక్క గదికి వెచ్చించి పద్మావతి ఏరియాలో మిగతా రూముల్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అదేవిధంగా ఉండేలా ఈ 170 గదులని కూడా ఆధునీకరించడం జరిగినది. అదేవిధంగా పద్మావతి ఏరియాలో వివిఐపిలకు కేటాయించే మిగతా రూములకు ఏ విధంగా ధరలు ఉన్నాయో అదేవిధంగా ఈ ఆధునికరించిన 170 గదులకు కూడా ధరలు నిర్ణయించడం జరిగినది. ఈ ఆధునికరించిన 170 గదులు ఆల్రెడీ వివిఐపీలకు కేటాయిస్తున్న రూములే తప్ప సామాన్యులకు కేటాయించే గదులు కావు. దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి ఆదాయం కూడా ఉండదు. 

 పై వాటితో పాటు 15,000 మంది సామాన్య భక్తులు ఉచితంగా ఉండేందుకు, వారికి లాకర్లతో పాటు తిరుమలలో యాత్రికుల సౌకర్యాల సముదాయం (పి.ఎ.సి) నాలుగు ఉన్నాయి. గత బోర్డులో ఇంకా 5000 మంది సామాన్య భక్తుల వసతి సౌకర్యం కల్పించడం కొరకు ఇంకో పి.ఏసి.ని నిర్మించుటకు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి, నిర్మాణం కూడా మొదలుపెట్టింది టీటీడీ యాజమాన్యం.

ఏదైతే సామాన్య భక్తుల కొరకు కేటాయించే 50 రూపాయలు, 100 రూపాయలు అద్దెలతో ఉన్న వసతి సముదాయాలనుకు ఎటువంటి అద్దెలు పెంచకపోగా 120 కోట్లు వెచ్చించి అధునీకరించారు. ఇంకో 100 కోట్లు అదనంగా వెచ్చించి సామాన్య భక్తులకు ఉచితంగా వసతిని అందించేందుకు గాను మరో పీఏసీ ని కూడా నిర్మిస్తున్న టిటిడి యాజమాన్యం. ప్రస్తుతం అద్దెలు పెంచింది పద్మావతి ఏరియాలో వివిఐపిలకు కేటాయించే 170 ఆధునికరించిన గదులకు మాత్రమే పెంచారు తప్ప, సామాన్య  భక్తులకు కేటాయించే గదులకు సంబంధించిన అద్దెలులో ఒక రూపాయి కూడా పెంచలేదు. దీనిని కొందరు రాజకీయ దురుద్దేశంతో వక్రీకరించి విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి తిరుమల శ్రీవారి భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము.

చదవండి: (సికింద్రాబాద్‌ టు విశాఖ.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలివే..)

మరిన్ని వార్తలు