సాక్షి, సూళ్లూరుపేట: కోవిడ్–19 మహమ్మారి కారణంగా ప్రయోగాలను వాయిదా వేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. ఈ ఏడాది డిసెంబర్లోపు ఒక్క ప్రయోగమైనా చేయాలని భావిస్తోంది. అలాగే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు మరో మూడు ప్రయోగాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో.. క్రమేపి లాక్డౌన్ను సడలించుకుంటూ అన్ని విభాగాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ 50 శాతం మంది అధికారులు, సిబ్బంది ప్రస్తుతం విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాలను మళ్లీ ప్రారంభించేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసుకుంటోంది.