రైల్లో అలారం చైన్‌కు లగేజీ తగిలిస్తే కేసు 

3 Nov, 2023 09:25 IST|Sakshi
ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్‌ పరికరానికి తగిలించిన సెల్‌ఫోన్‌

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీ బ్యా­గు­లు, సెల్‌ఫోన్‌లను అలారం చైన్‌ పుల్లింగ్‌ పరికరానికి వేలాడదీయడం చట్టరీత్యా తీవ్ర నేరమని రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో హెచ్చరించారు. పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్‌ రైళ్ల కోచ్‌లను ఎల్‌బీహెచ్‌ కోచ్‌లుగా ఆధునీకరించారు.

అత్యవసర పరిస్ధితిలో రైలును ఆపేందుకు గతంలో ఉపయోగించిన అలారం చైన్‌ స్థానంలో పాసింజర్స్‌ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్‌ డివైజ్‌ (పీఈఏఎస్‌డీ) అమర్చారు. ఈ పరికరం ఎరుపు రంగుతో హ్యాండిల్‌ను పోలి ఉండటంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీలు, సెల్‌ఫోన్‌ను వేలాడదీస్తున్నారు.

ఈ కారణంగా పరికరం ఆటోమెటిక్‌గా లాక్‌ అయ్యి రైలు నిలిచిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్‌ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్‌ ఉపయోగించడం తీవ్ర నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్‌ ప్రకారం రూ.1000 జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చదవండి: ‘స్కిల్‌’ శిక్షకులకు ఆహ్వానం 

మరిన్ని వార్తలు