ఇప్పటంలో జనసేన మూకల ఓవరాక్షన్‌.. గుడిలోకి వెళ్లి తాళాలు వేసి..

5 Mar, 2023 08:59 IST|Sakshi

మిగిలిపోయిన ఆక్రమణలు తొలగించేందుకు అధికారుల రాక

కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులు

అవి ప్రభుత్వ భూమిలోనివని నిరూపించాలంటూ హంగామా

గుడిలోకి వెళ్లి తాళాలు వేసుకున్న వైనం

ఆధారాలు చూపించడంతో తోకముడిచిన మూకలు

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా ఇప్పటంలో గతంలో తొలగించకుండా మిగిలిపోయి­న ఆక్రమణల విషయంలో జనసేన మూకలు శని­వారం మరోసారి గ్రామంలో చిచ్చుపెట్టేందుకు యత్నించారు. అధికారులు ఎంతచెప్పినా వినకపోవడంతోపాటు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. సదరు ఆక్రమణలు ప్రభుత్వ భూ­మి­లోనివేనని అధికారులు స్పష్టంచేయ­డం.. పోలీసుల హెచ్చరికలతో జనసేన మూకలు తోకముడిచాయి. 

వివరాల ప్రకారం.. గతంలో నానా రభస సృష్టించి ఇప్పటంలో అభివృద్ధి పనులను జనసేన శ్రేణులు అడ్డుకోవడంతో మంగళగిరి–తాడేపల్లి మున్సి­పల్‌ కార్పొరేషన్‌ (ఎంటీఎంసీ) అధికారులు అప్పట్లో కొన్ని ఆక్రమణలను తొలగించలేదు. వీటిని తిరిగి శనివారం తొలగించేందుకు సిద్ధమవుతుండగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జనసేన, టీడీపీ శ్రేణులు గ్రామంలో మరోసారి రగడ సృష్టించేందుకు ప్ర­యత్నించారు. ముఖ్య­మంత్రిని, ప్రభుత్వా­న్ని రాయడానికి వీల్లేని భాషలో ఇష్టానుసారం దూషించారు. కానీ, ఎంటీఎంసీ అధి­కా­రులు మాత్రం సంయమనం పాటించారు. 

అంతేకాక.. తామేమీ ప్రైవేట్‌ ఆస్తుల­ను తొలగించడంలేదని.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించుకున్న ప్రహరీ గోడలు, మెట్లు, వ్యాపార సముదాయాలు మాత్రమే తొలగిస్తున్నామని స్ప­ష్టం­­చేశారు. ఇంతలో అది ప్రభుత్వ భూమి అయితే ఆధారాలు చూపాలని జనసేన శ్రేణులు డిమాండ్‌ చేయగా అధికారులు అందుకు సరేనన్నారు. అదే సమయంలో గ్రామంలో బయట వ్యక్తులు ఎవరూ ఉండకూడ­దని పోలీసులు హె­చ్చ­­రించడంతో ఒక్క­సారిగా అక్కడ ఉద్రి­క్తత ఏర్పడింది. వారిని అడ్డుకునే ప్రయత్నంలో జనసేన మూకలు రెచ్చిపోగా పోలీ­సులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరి­కొందరు అక్కడి రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. 

ఇంతలో ఎంటీఎంసీ అధికా­రులు 1916 నాటి రికార్డులను తీసుకొచ్చి వారికి చూపించారు. దీంతో.. అధికారులు ఆక్రమణలపై చేసిన మార్కింగ్‌ కొలతలు.. రికార్డుల్లో ఉన్న కొలతలు ఒకటేనని తేలిపోయింది. ఇక ఏం మాట్లాడాలో అర్ధంకాక అధి­­కారులతో జనసేన మూకలు వాదనకు దిగాయి. పోలీసులు హెచ్చరించడంతో వారు బయటకొచ్చి వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణి­గింది. ఇదిలా ఉంటే.. జనసేన శ్రేణులు గుడిలోకి వెళ్లి తాళాలు వేసుకోవడం.. ప్రభుత్వం, సీఎంపై నానా మాటలు అనడంతో గ్రామానికి చెందిన మహిళలు బహిరంగంగానే ఆక్షేపించారు.

మరిన్ని వార్తలు