Kurnool: శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా తేళ్లు

16 Aug, 2022 17:28 IST|Sakshi
స్వామివారిపై తేళ్లను వదులుతున్న భక్తులు

కోడుమూరు: ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండమీద వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే మూడవ సోమవారం ఈ వింత ఆచారాన్ని కోడుమూరు ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. 


విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. కోడుమూరులోని కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకు బొంకు లేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి కానుకగా సమర్పించి తమ కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం ఇక్కడ ప్రతి యేటా కొనసాగే వింత ఆచారం. 


తేలును పట్టుకునే సమయంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. (క్లిక్: మూడు దేశాల ముచ్చటైన కళ్యాణం)

మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు