ఖైరతాబాద్: ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతోందని, ఎన్టీఆర్ కలలుగన్న రాజ్యం సాకారమైందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కావాలని తొలగించడంలాంటి చర్యలు ఏ పార్టీకి మంచిది కాదని చెప్పారు. ప్రతిపక్షాల వారు వైఎస్ జగన్ లాగా హుందాగా వ్యవహరించాలని కోరారు.
ఎన్టీఆర్ లెజెండ్..: బాలకృష్ణ: ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంగళవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. బాలకృష్ణ మాట్లాడుతూ సినీ, రాజకీయరంగాల్లో ఎన్టీఆర్ పాత్ర మరువలేనిదని, ఆయన లెజెండ్ అని చెప్పారు.