పరువు తీస్తామని బెదిరిస్తున్నారు

24 Dec, 2020 14:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అవసరం కోసం అప్పుచేసి మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో చిక్కుకొన్న బాధితులు ఒకరొకరుగా బయటకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. యాభై వేలు లోన్ తీసుకొని 2 లక్షల 80 వేలు కట్టినా వేధింపులు ఆపలేదంటూ నాగరాజు అనే బాధితుడు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆన్‌లైన్‌  లోన్ యాప్‌ల ఉచ్చులో చిక్కుకొన్న తనను కాపాడి రుణ విముక్తి కలిగించాలని  వేడుకున్నాడు. అనంతరం నాగరాజు సాక్షి టీవీతో మాట్లాడాడు. ఫేస్‌బుక్లో ప్రకటన చూసి తొలుత నాలుగు యాప్‌లలో 20వేల రూపాయల లోన్‌ తీసుకున్నానని తెలిపాడు. కమిషన్ తీసుకొని తన అకౌంట్‌లో పదకొండు వేలు వేసినట్లు తెలిపాడు. చదవండి: వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్‌

‘వారం లోపే లోన్ తిరిగి చెల్లించాలి. రొటేషన్ కోసం చాలా యాప్‌లలో లోన్ తీసుకొని డ్యూలు కట్టాను. 50 వేలకి 2 లక్షల ఎనభై వేలు చెల్లించినా అప్పు తీరలేదని వేధిస్తున్నారు. ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తూ క్షోభ పెడుతున్నారు. ఫోన్ కాంటాక్ట్ నంబర్లకు మెసెజ్‌లు పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తున్నారు. నలభై శాతం వడ్డీ వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. అవసరానికి అప్పుచేసి వాళ్ళ ఉచ్చులో ఇరుక్కున్నాను. ప్రభుత్వ భరోసాతో పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేశాను. నాలాగు చాలామంది మైక్రో ఫైనాన్స్ తీసుకొని మానసిక క్షోభ అనుభవిస్తున్నారు’. అని నాగారాజు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు