ప్రధానికి లేఖ రాసే ధైర్యం చంద్రబాబుకు లేదా?

16 Feb, 2021 13:21 IST|Sakshi

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని, ఇప్పటికే ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ కూడా రాశారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. పోస్కోతో కలిసినంత మాత్రాన లాలూచీ పడినట్లు కాదని, 2014 లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చర్చలు జరగలేదా..?. 2018లో పోస్కో ప్రతినిధులు చంద్రబాబును కలవలేదా అని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, సీఎం జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని  మంత్రి అవంతి హెచ్చరించారు.

రెండు సార్లు జైలుకెళ్లొచ్చినా అచ్చెన్నాయుడికి ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌పై తమ పార్టీ విధానం స్పష్టంగా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు ఆ బాధ్యత లేదా, ప్రధాని లేఖ రాసే ధైర్యం లేదా అని దుయ్యబట్టారు. దీక్షలు చేస్తున్న నేతలను ఎందుకు టీడీపీ నేతలు పరామర్శించలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలని అవంతి హితవు పలికారు. ఈ నెల 20న స్టీల్‌ప్లాంట్‌ కోసం మహా పాదయాత్ర చేస్తున్నామని.. ఆ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.
(చదవండి: కలెక్టర్‌ వినూత్న శైలి: ఆ నోటీస్‌లో ఏముందంటే..)
తిత్లీ పాపం.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ..

మరిన్ని వార్తలు