ఇంద్రకీలాద్రిపై నిత్యాన్నదానం పున:ప్రారంభం 

16 Nov, 2021 04:21 IST|Sakshi
అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్న భక్తులు

దుర్గమ్మ సన్నిధిలో భవానీ మండల దీక్షలు ప్రారంభం

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి అమ్మవారి నిత్య అన్న ప్రసాద వితరణ పునఃప్రారంభమైంది. ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ మహా మండపం రెండో అంతస్తులోని అన్న ప్రసాద వితరణ విభాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్, ఈవోలు భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాద వితరణలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. నిత్యం 2,500 మందికి, శుక్ర, ఆదివారాలలో 4,000 మందికి అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, పాలక మండలి సభ్యురాలు ఎన్‌.సుజాత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు