ఆపద‌ సమయంలో ప్రభుత్వాస్పత్రులే అండ..!

14 Oct, 2020 20:20 IST|Sakshi

గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన ఔట్‌పేషెంట్లు

సర్జరీలు లేక బోసిపోయిన థియేటర్లు

ల్యాబొరేటరీ పరీక్షలు 79%.. ఇన్‌పేషెంట్‌ సేవల్లో 46% తగ్గుదల

కరోనాకు భయపడి జూలై వరకూ ‘ప్రైవేట్‌’ తెరవనేలేదు

ఇప్పుడిప్పుడే మొదలవుతున్న నాన్‌కోవిడ్‌ సేవలు

ఆపన్న హస్తం అందించిన టెలీమెడిసిన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలపై గడిచిన ఏడున్నర నెలలుగా కరోనా మహమ్మారి ఎంతగానో ప్రభావం చూపింది. వైరస్‌ సోకుతుందనే భయంతో రోగులు.. ఉన్న జబ్బులకూ ఆస్పత్రులకు రాలేక ఇబ్బంది పడ్డారు. మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఔట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ సేవలు నిలిపివేశాయి. ఈ ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులే అండగా నిలిచాయి. రాష్ట్రంలో ప్రధానంగా సెకండరీ కేర్‌ అంటే సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులే కొలమానంగా చూస్తాం. ఆయా ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్‌ సేవలు 55%, ఇన్‌పేషెంట్‌ సేవలు 46% తగ్గిపోయాయంటే కరోనా ప్రభావం ఎంతగా చూపిందో అంచనా వేయవచ్చు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిశీలన మేరకు విధిలేని పరిస్థితుల్లో మినహా చాలామంది రోగులు ఇంటికే పరిమితమైనట్టు తెలుస్తోంది.(చదవండి: ఏపీలో రికార్డ్‌స్థాయిలో కరోనా పరీక్షలు)

వాయిదాకే మొగ్గు

  • చాలామంది రకరకాల జబ్బులున్నా కరోనాతో భయపడి వాయిదా వేసుకున్నారు.
  • అత్యవసరమైతే మినహా సర్జరీల జోలికి వెళ్లలేదు.
  • చాలామంది దీర్ఘకాలిక జబ్బుల బాధితులు ఫోన్‌ల ద్వారానే డాక్టర్లను సంప్రదించి మందులు వేసుకున్నారు.
  • నెలకోసారి లేదా మూణ్నెళ్లకోసారి రక్తపరీక్షలు చేయించుకునే వాళ్లు ల్యాబొరేటరీలకే వెళ్లలేదు. దీంతో 79% తగ్గినట్టు తేలింది.
  • దగ్గు, జ్వరమూ వంటి లక్షణాలుంటే కరోనా అని భయపడి చాలామంది వైద్యపరీక్షలు చేయించుకున్నారు.
  • కరోనా సమయంలో రాష్ట్రంలో పారాసెట్‌మాల్, అజిత్రోమైసిన్‌ వంటి వాటితో పాటు విటమిన్‌ మాత్రలు భారీగా అమ్ముడు పోయాయి.
  • విచిత్రమేమంటే కరోనా వైరస్‌ కారణంగా మానసిక వైద్యులను ఫోన్‌ ద్వారా సంప్రదించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
  • కరోనాకు భయపడి జూలై మొదటి వారం వరకూ ప్రైవేట్‌ ఆస్పత్రులు తెరవలేదు. 
  • కరోనా సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14410 టెలీమెడిసిన్‌ నెంబర్‌ రోగులను ఆదుకుంది.
  • టెలిమెడిసిన్‌లో భాగంగా సుమారు 50వేల మంది సేవలు పొందారు.

కోవిడ్‌-19కి భయపడి..
కరోనా వైరస్‌ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల సేవలే అండగా నిలిచాయి. వైరస్‌కు చాలామంది మానసికంగా భయపడ్డారు. అందుకే ఆస్పత్రులకు రావడానికి వెనక్కు తగ్గారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరికొద్ది రోజుల్లో పూర్తిగా నాన్‌-కోవిడ్‌ సేవలూ అందుబాటులోకి వస్తాయి.
- డా.రామకృష్ణారావు, కమిషనర్‌, వైద్య విధానపరిషత్

వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందిన వారి వివరాలు:
 

కేటగిరీల వారీగా ఏప్రిల్‌ 2019- ఆగస్ట్‌ 2019  ఏప్రిల్‌ 2020-ఆగస్ట్‌ 2020    తగ్గుదల శాతం
ఔట్‌పేషెంట్లు 98,98,095      44,87,235       55
ఇన్‌పేషెంట్లు 9,04,751  4,90,119      46
మేజర్‌ సర్జరీలు 39,328     28,103     29
కు.ని. ఆపరేషన్లు 32,341     10,246 68
ప్రసవాలు 74,041 66,393     10
ఎక్స్‌రేలు     247105     1,00,074      60
ఈసీజీ     95,269 48,758     49
ల్యాబ్‌ టెస్ట్‌లు 95,46,780       20,24,452        79

మరిన్ని వార్తలు